ఎల్లారెడ్డి/ గాంధారి/ నాగిరెడ్డిపేట/ లింగంపేట/ బాన్సువాడ, సెప్టెంబర్ 23 : జిల్లావ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ జోరుగా కొనసాగుతున్నది. గురువారం సైతం పలు గ్రామాల్లో వైద్యసిబ్బంది శిబిరాలను ఏర్పాటు చేసి టీకాలు వేయగా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఎల్లారెడ్డి మండలం మల్కాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ఎంపీపీ మాధవి పరిశీలించారు.
గాంధారి మండలంలోని చద్మల్ తండా, బీర్మల్ తండా, రాంపూర్గడ్డ, తిప్పారం తండా, సర్వపూర్, ముదెల్లి, చెన్నాపూర్ తదితర గ్రామాల్లో కొవిడ్ టీకాలు వేశారు. గాంధారి ప్రభుత్వ దవాఖాన, ఉత్తునూర్ ప్రభుత్వ దవాఖాన పరిధిలో 935 మందికి టీకాలు వేసినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. మండలంలో ఇప్పటివరకు 33,986 మందికి టీకాలు వేసినట్లు తెలిపారు. వ్యాక్సినేషన్ కేంద్రాలను ఎంపీడీవో సతీశ్, ఎంపీవో రాజ్కిరణ్రెడ్డి పరిశీలించారు. నాగిరెడ్డిపేట్ మండలంలోని పలు గ్రామాల్లో కొవిడ్ టీకాలు వేశారు. మాల్తుమ్మెద గ్రామంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను ఎంపీడీవో రఘు, గోపాల్పేట్లో ఎంపీవో శ్రీనివాస్ పరిశీలించారు.
లింగంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో 592 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు పీహెచ్సీ వైద్యురాలు సమీనా తెలిపారు. పీహెచ్సీలో 18 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగెటివ్ వచ్చినట్లు తెలిపారు.
బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని ఆరో వార్డులో ఏర్పాటుచేసిన కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని బల్దియా చైర్మన్ జంగం గంగాధర్ పరిశీలించారు. ఆయన వెంట వైస్ చైర్మన్ జుబేర్, మున్సిపల్ కమిషనర్ రమేశ్, కాలనీవాసులు అంబలిపూర్ రాజు, వడ్ల శివ, అంగన్వాడీ టీచర్ మహాదేవి తదితరులు ఉన్నారు.