బోధన్/బోధన్ రూరల్/రెంజల్, సెప్టెంబరు 30: వర్షాలు తగ్గిపోయినప్పటికీ, మంజీరా నదిలో వరద ఉధృతి మాత్రం తగ్గుముఖం పట్టలేదు.. మంజీర పరీవాహక ప్రాంతంలో మహారాష్ట్ర, సంగారెడ్డి నుంచి నిజాంసాగర్ వైపుగా వరద ప్రవాహం ఉండంతో.. నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుంచి పెద్ద ఎత్తున దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.మంజీరకు తోడు.. గోదావరి వరద, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో బోధన్ మంజీర తీరంలోని గ్రామాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. మూడు రోజులుగా జలదిగ్బంధం లో ఉన్న బోధన్ మండలం హంగర్గా గ్రామంలో కొంతమేరకు నీరు తగ్గినా.. ఆ గ్రామానికి వరద ముప్పు తొలగిపోలేదు. ఆ గ్రామం చుట్టూ ఉన్న వ్యవసాయ భూములు వరదనీటిలోనే ఉన్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి పెద్ద ఎత్తున దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో మంజీర తీరంలోని హంగర్గా తదితర గ్రామాలకు కొంతమేరకు ఊరట లభించింది. మంజీర తీరంలోని బిక్నెల్లి పంట పొలాలు, వ్యవసాయ క్షేత్రాల్లో మాత్రం నాలుగు అడుగుల మేరకు నీరు తగ్గింది. మరో నాలుగు అడుగుల నీరు తగ్గితే తప్ప.. పంట పొలాలు బయటికి కనిపించే అవకాశం లేదు. మంజీర తీరంలోని సుంకిని, హూన్నా, ఖాజాపూర్, సిద్ధాపూర్, ఖండ్గావ్, కొప్పర్గ తదితర గ్రామాల్లోని వ్యవసాయ పంటలకు తీవ్రమైన నష్టం జరిగింది.
ఖండ్గామ్ వద్ద ఉధృతంగా మంజీర
బోధన్ మండలంలోని సాలూరా వద్ద తెలంగాణ- మహారాష్ట్ర సరిహద్దు వద్ద సాలూరా మీదుగా మంజీర ప్రవాహం ఇంకా ఉధృతంగానే కొనసాగుతున్నది. సాలూరా వద్ద పాత వంతెనను తాకుతూ మంజీర ప్రవహిస్తున్నది.
కందకుర్తి వద్ద తగ్గుముఖం
కందకుర్తి గోదావరి నదికి వరద ఉధృతి గురువారం స్వల్పం గా తగ్గుముఖం పట్టింది. ఎగువన గల మహారాష్ట్రలో ఎత్తిన ప్రాజెక్ట్ గేట్లను అక్కడి అధికారులు తిరిగి మూసివేయడంతో వరద ప్రభావం క్రమంగా తగ్గుతున్నది.
ధర్మాబాద్ – కందకుర్తి ప్రధాన రోడ్డు, వంతెనపై వరద తగ్గింది. పుష్కర ఘాట్ వెళ్లే రోడ్డు మాత్రం పూర్తిగా జలమయమైంది.