బాన్సువాడ రూరల్, జూన్ 17 : కరోనా కర్కశత్వానికి దిక్కులేని వారిగా మారిన ఆ చిన్నారుల దీన స్థితిని చూసి డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి చలించిపోయారు. ప్రభుత్వ సహాయం అందేవరకు ప్రతినెలా రూ.10వేలు అందజేస్తానని, డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తానని ఆ చిన్నారులకు అండగా నిలిచారు. వివరాలు ఇలా ఉన్నాయి..
బాన్సువాడ మండలం బోర్లం క్యాంపుతండాకు చెందిన ఆంగోత్ సర్వన్, శారద దంపతులు కరోనాబారిన పడి ఆరునెలల వ్యవధిలో ఒకరితరువాత మరొకరు మృతి చెందారు. దంపతుల మృతితో వారి పిల్లలు కళ్యాణి, చిట్టూ, జీవన్ అనాథలుగా మారారు. ఒక వైపు తల్లిదండ్రులను కోల్పోయి, మరోవైపు ఉండేందుకు ఇల్లు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న చిన్నారులను పోచారం భాస్కర్రెడ్డి గురువారం పరామర్శించారు. చిన్నారులతో స్వయంగా మాట్లాడిన భాస్కర్రెడ్డి వారి పరిస్థితిని చూసి చలించిపోయారు. ‘నేనున్నా.. భయపడొద్దు..’ అంటూ ధైర్యం చెప్పిన భాస్కర్రెడ్డి, ప్రభుత్వ సహాయం అందేవరకు ప్రతినెలా రూ.10వేలు ఇస్తానని ప్రకటించారు. డబుల్ బెడ్ రూం ఇల్లు మంజూరు చేయిస్తానన్నారు. తక్షణ సహాయంగా రూ.10వేలు అందజేశారు. ఆయనవెంట టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మోహన్ నాయక్, నాయకులు దొడ్ల వెంకట్రామ్రెడ్డి, మహ్మద్ ఎజాస్, గోపాల్రెడ్డి, బోడ చందర్, రతన్, సాయిలు, సుభాష్ తదితరులు ఉన్నారు.
బాధితులకు పరామర్శ
బాన్సువాడ మండలంలోని బోర్లం, బోర్లంతండా, ఇబ్రహీంపేట్ గ్రామాలకు చెందిన పలువురు కరోనాబారిన పడి మృతి చెందగా, బాధిత కుటుంబాలను పోచారం భాస్కర్రెడ్డి పరామర్శించారు. ఆయనవెంట బోర్లం, ఇబ్రహీంపేట్ గ్రామ సర్పంచులు సరళ, నారాయణరెడ్డి, ఎంపీటీసీ శ్రావణి, బుడిమి సహకార సంఘం అధ్యక్షుడు పిట్ల శ్రీధర్, గురువినయ్కుమార్, శ్రీనివాస్రెడ్డి, నెర్రె నర్సింహులు, దేవేందర్రెడ్డి, సుభాష్, కొండ వెంకటి, సాయిలు యాదవ్, పండరి, రమేశ్ తదితరులు ఉన్నారు.