సదాశివనగర్, మే 13: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన హరితహారం కార్యక్రమాన్ని ఆ గ్రామం సద్వినియోగం చేసుకుంటున్నది. గ్రామంలో విరివిగా మొక్కలను నాటడంతోపాటు వాటిని సంరక్షిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అమలుచేస్తూ అభివృద్ధిలో దూసుకుపొతున్నది కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని తిర్మన్పల్లి గ్రామం. హరితహారంలో భాగంగా ప్రతి ఇంటికీ పది తులసి మొక్కలతో పాటు ఆరు వివిధ రకాల మొక్కలను పంపిణీ చేసి నాటించారు. వాటిని రక్షించేలా చూస్తున్నారు. అవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా 2,800 మొక్కలను నాటి కంచెను ఏర్పాటు చేశారు. వాటికి ప్రతిరోజూ ట్యాంకర్తో నీటిని పట్టడంతో అవి ప్రస్తుతం ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలోని నర్సరీలో వివిధ రకాల పది వేల మొక్కలను పెంచుతున్నారు. మంకీ ఫుడ్ కోర్టులో 300 రకాల పండ్ల మొక్కలను నాటారు. పల్లెప్రకృతి వనంలో వివిధ రకాల రెండు వేల పూలు, పండ్ల మొక్కలను పెంచుతున్నారు. ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద 200 మొక్కలను నాటి సంరక్షిస్తున్నారు. గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చదనం పరుచుకున్నది. గ్రామాన్ని పలుమార్లు సందర్శించిన కలెక్టర్ శరత్ సర్పంచ్తో పాటు పాలకవర్గాన్ని అభినందించారు. గ్రామంలో 148 ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయడంతో రాత్రివేళలో జిగేల్ మంటున్నది. గ్రామంలోని ప్రధాన వీధుల్లో రూ.8 లక్షలతో సీసీ రోడ్లను నిర్మించారు. గ్రామంలో 205 ఇంకుడు గుంతలను నిర్మించుకున్నారు.