ఖలీల్వాడి (మోపాల్)/రెంజల్/కోటగిరి జూలై 28 : పల్లెప్రగతి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ చిత్రామిశ్రా, జేడీఏ గోవింద్ మండల స్థాయి అధికారులను ఆదేశించారు. మోపాల్ మండలం భైరాపూర్, అమ్రాబాద్ గ్రామాల్లో అడిషనల్ కలెక్టర్, రెంజల్ మండల కేంద్రంతోపాటు సాటాపూర్, బోర్గాం గ్రామాల్లో జేడీఏ గోవింద్ బుధవారం పర్యటించారు. పల్లెప్రకృతివనాలను, పల్లెప్రగతి పనులను వారు పరిశీలించారు. భైరాపూర్లో వైకుంఠధామం పనులను పూర్తిచేయాలని అడిషనల్ కలెక్టర్ ఆదేశించారు. ఆమె వెంట సర్పంచులు సరిచంద్, గోకుల్ సింగ్, ఎంపీడీవో సుధాకర్రావు, ఎంపీవో ఇక్బాల్ తదితరులు ఉన్నారు. ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలో ఉద్యోగులు తమవంతు బాధ్యతగా మొక్కలను నాటాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి గోవింద్ సూచించారు. వివిధ పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా చర్యలు సుకోవాలన్నారు. రైతువేదిక, పల్లెప్రకృతివనం, వైకుంఠధామాన్ని, రెంజల్ విండో రికార్డులను పరిశీలించారు. సాటాపూర్, బోర్గాం గ్రామాల్లో ఎరువుల దుకాణాలను తనిఖీ చేశారు. ఆయన వెంట రెంజల్ విండో చైర్మన్ అసాని ప్రశాంత్, సర్పంచ్ రమేశ్కుమార్, ఏవో లక్ష్మీకాంత్రెడ్డి, సీఈవో రాము గౌడ్ తదితరులు ఉన్నారు. కోటగిరి మండలంలోని సుంకిని, కారేగాం, హెగ్డోలి తదితర గ్రామాల్లో చేపట్టిన పల్లెప్రగతి పనులను ఎంపీడీవో మహ్మద్ అతారుద్దీన్, ఎంపీవో మారుతి, ఏపీవో రమణ బుధవారం పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తిచేయాలని కార్యదర్శులకు ఎంపీడీవో సూచించారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని, చనిపోయిన మొక్కలస్థానంలో కొత్తవాటిని నాటాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శుల పనితీరుపై సంతృప్తి వ్యక్తంచేశారు.