నమస్తే తెలంగాణ యంత్రాంగం, జనవరి 24: జిల్లాలో జ్వరసర్వే ముమ్మరంగా కొనసాగుతున్నది. వైద్యారోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ ప్రజల ఆరోగ్య వివరాలను సేకరిస్తున్నారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలతో బాధపడుతున్నవారికి మందుల కిట్లను అందజేసి ఐసొలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు. లక్షణాల తీవ్రత ఎక్కువగా ఉంటే వెంటనే కరోనా టెస్టులు చేయిస్తున్నారు.
మద్నూర్ మండలంలో 3087 ఇండ్లను సందర్శించి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించామని డాక్టర్ శ్వేత తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు ఉన్న 26 మందికి మందుల కిట్లను అందజేశామని చెప్పారు. పిట్లం మండలంలో జ్వరసర్వే కొనసాగింది. పలు గ్రామాల్లో వైద్య సిబ్బంది శిబిరాలను ఏర్పాటుచేసి సెకండ్ డోస్ టీకాలు వేశారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి శివకుమార్ మాట్లాడుతూ.. జ్వరసర్వేకు ప్రజలు సహకరించాలని కోరారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల టీకా తీసుకోవాలని సూచించారు.
ఎల్లారెడ్డి పట్టణ పరిధిలో 1158 ఇండ్లను వైద్య సిబ్బంది సర్వే చేశారు. స్వల్ప లక్షణాలున్న 53 మందికి మెడిసిన్ కిట్లను అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో మొత్తం 534 ఇండ్లలో జ్వరసర్వే నిర్వహించి విరాలను సేకరించారు. జ్వరం, జలుబుతో బాధపడుతున్న 18 మందికి మందులను అందజేశారు. సర్వేలో మత్తమాల పీహెచ్సీ వైద్యాధికారి వెంకటస్వామి, హెల్త్ సూపర్వైజర్లు మధుసూదన్, వెంకట్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
సదాశివనగర్ మండల కేంద్రంలో డాక్టర్ ఇద్రిస్ ఘోరీ ఆధ్వర్యంలో జ్వరసర్వే కొనసాగింది. కార్యక్రమంలో సీహెచ్వో నాగరాజు, సర్పంచ్ బద్దం శ్రీనివాస్రెడ్డి, ఉప సర్పంచ్ వంకాయల రవి, పంచాయతీ కార్యదర్శి సంతోష్ తదితరులు పాల్గొన్నారు. గాంధారి మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించిన జ్వరసర్వేను తహసీల్దార్ గోవర్ధన్, ఎంపీడీవో సతీశ్, మండల వైద్యాధికారి హరికృష్ణ పర్యవేక్షించారు. తాడ్వాయి మండలంలోని చిట్యాల, కరడ్పల్లి, నందివాడ, తాడ్వాయి గ్రామాల్లో జ్వరసర్వే నిర్వహించామని మండల వైద్యాధికారి రవీందర్రెడ్డి తెలిపారు. ఎర్రాపహాడ్ పీహెచ్సీలో టీనేజర్లకు కొవిడ్ టీకాలు వేశామని చెప్పారు.
బాన్సువాడ మండలంలోని 25 గ్రామ పంచాయతీల్లో ఆరోగ్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ జ్వర సర్వేను నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శులు, ఆరోగ్య సిబ్బంది, వీఏవోలు, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు బృందాలుగా ఏర్పడి ఆయా గ్రామాల్లో జ్వర సర్వేలో పాల్గొంటున్నారు.
బీబీపేట్ మండలకేంద్రంతోపాటు మాందాపూర్, జనగామ, తుజాల్పూర్, మాల్కాపూర్, కోనాపూర్, యాడారం, శివారు రాంరెడ్డిపల్లి, ఇస్సానగర్, ఉప్పర్పల్లి గ్రామాల్లో ఫీవర్ సర్వే కొనసాగింది. ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, వైద్య సిబ్బంది కలిసి జ్వరంతో బాధపడుతున్న వారిని గుర్తించి మెడిసిన్ కిట్లను అందజేశారు. ఆయా గ్రామాల ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్ ఉమ్మడి మండలంలో 2021 ఇండ్లలో జ్వరసర్వే చేపట్టినట్లు మండల వైద్యాధికారి డాక్టర్ రాజారమేశ్ తెలిపారు. 44 మందికి లక్షణాలు ఉండడంతో వారికి మెడిసిన్ కిట్లను అందజేశామని తెలిపారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.