హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): కరోనా కారణంగా విధించిన లాక్డౌన్ను ఆదివారం నుంచి సంపూర్ణంగా ఎత్తివేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. కరోనా కేసుల సంఖ్య, పాజిటివిటీ శాతం గణనీయంగా తగ్గిందని, వైరస్ పూర్తిగా నియంత్రణలోకి వచ్చిందని వైద్యారోగ్యశాఖ అందించిన నివేదిక ఆధారంగా శనివారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకొన్నారు. ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో లాక్డౌన్ ఎత్తివేత సహా పలు కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. లాక్డౌన్ సందర్భంగా విధించిన నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను మంత్రిమండలి ఆదేశించింది. దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పట్టడం, పక రాష్ట్రాల్లో కూడా నియంత్రణలోకి వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకొన్నది. మనరాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకంటే వేగంగా కరోనా నియంత్రణలోకి వచ్చిందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. కరోనా వైరస్ను నియంత్రించేందుకు మే 12న రాష్ట్రంలో లాక్డౌన్ విధించారు. 38 రోజులపాటు రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగింది.
ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలి
ప్రజాజీవనం ఇబ్బందులకు గురి కావొద్దని, సామాన్యుల బతుకుదెరువు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో లాక్డౌన్ ఎత్తివేసినట్టు మంత్రిమండలి ప్రకటించింది. లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన కరోనా విషయంలో నిర్లక్ష్యం తగదని, తప్పనిసరిగా మాస్ ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, శానిటైజర్ ఉపయోగించడం తదితర కరోనా స్వీయ నియంత్రణ విధానాలను విధిగా పాటించాలని సూచించింది. ప్రజలంతా ప్రభుత్వ నిబంధనలను అనుసరించాలని స్పష్టంచేసింది. మే 12న లాక్డౌన్ విధించిన ప్రభుత్వం.. మొదటి రోజులో నాలుగు గంటలే ప్రజలకు సడలింపు ఇచ్చింది. ఆ తర్వాత ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఆంక్షలు సడలించింది. దానిని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. తాజాగా వైరస్ వ్యాప్తి తగ్గిపోవటంతో లాక్డౌన్ను పూర్తిగా ఎత్తివేసింది.
మాస్క్ లేకుంటే వెయ్యి ఫైన్
రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గినప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం సూచించింది. ఆదివారం నుంచి లాక్డౌన్ ఎత్తివేసినప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి, భౌతికదూరం పాటించాలని స్పష్టంచేసింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించకుండా తిరిగితే రూ.1,000 జరిమానా విధిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ శనివారం విడుదలచేసిన కరోనా నియంత్రణ మార్గదర్శకాల్లో హెచ్చరించారు.
ఇవీ మార్గదర్శకాలు