నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
రేపటి నుంచి సర్టిఫికెట్ల పరిశీలన
14న సీట్ల కేటాయింపు
నవీపేట,ఆగష్టు 4: కొలువులో తొందరగా స్థిరపడాలన్నా, ఇంజినీర్గా ఎదగాలన్నా.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులకు మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. డిప్లొమా విద్యార్థులకు నైపుణ్యాలు మెరుగ్గా ఉంటుండడంతో అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. దీంతో డిప్లొమా కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నది. నిజామాబాద్ జిల్లాలో సైతం ఐదు ప్రభుత్వ కళాశాలలు ఏర్పాటు చేసి పేద, మధ్యతరగతి విద్యార్థులకు సాంకేతిక విద్యను అందుబాటులోకి తెచ్చింది.
ఒక్కో కోర్సులో 60 సీట్లు
నిజామాబాద్ జిల్లాలో నవీపేట, నిజామాబాద్, నందిపేట, కోటగిరి, నిజామాబాద్ ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో సివిల్, మెకానికల్, కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కళాశాలలో ఉన్న కోర్సుల మేరకు 60 చొప్పున సీట్లు ఉన్నాయి.
కమిషనర్ పర్యవేక్షణలో..
సాంకేతిక కళాశాల విద్యను రాష్ట్రంలో ప్రత్యేకంగా కమిషనర్ పర్యవేక్షిస్తుండడంతో విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందుతున్నాయి. ఆధునిక టెక్నాలజీకి అనుకూలంగా ప్రపంచంలో డిమాండ్ ఉన్న కోర్సుకు అనుగుణంగా సిలబస్ను మారుస్తూ విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తున్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థుల సంరక్షణకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా అధ్యాపకులు, విద్యార్థుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానాన్ని అవలంబిస్తున్నారు.
నేటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ షురూ..
ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం అడ్మిషన్లకు గురువారం నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. 5 నుంచి 9వ తేదీ వరకు ఆన్లైన్లో విద్యార్థుల వివరాలు నమోదు చేసి స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరై ఈ నెల 12వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. 14వ తేదీన అభ్యర్థులకు సీట్లను కేటాయించనున్నారు.