అధికారులను ఆదేశించిన కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి రూరల్, జనవరి 18: రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యుల జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా స్థాయి అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 19, 20 తేదీల్లో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్, సభ్యులు పర్యటిస్తారన్నారు. 19న అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ దవాఖానలు, రేషన్ షాపులను సందర్శించి జిల్లాలో ఆహార భద్రతపై పరిశీలిస్తారన్నారు. మారుమూల ప్రాంతమైన మహదేవపూర్ మండలాన్ని ఎంపిక చేసినందున పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. 20న ఆహార భద్రతకు తీసుకుంటున్న చర్యలపై జిల్లా కేంద్రంలో సమీక్ష నిర్వహిస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా సంక్షేమ అధికారి కే సామ్యూల్, డీఆర్డీవో పురుషోత్తం, జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీరామ్, జిల్లా పౌరసరఫరాల అధికారి గౌరీశంకర్, సివిల్ సప్లయ్ డీఎం రాఘవేందర్, విద్యాశాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.