పంట నష్టపోయిన వారికి అండగా ఉంటాం
పరిహారం అందించేందుకు కృషి : ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
మిర్చి పంటల పరిశీలన
నష్టంపై నివేదిక ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు ఆదేశం
రేగొండ, జనవరి 17 : అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని చెన్నాపురం గ్రామంతో పాటు పలు గ్రామాల్లో దెబ్బతిన్న మిర్చి పంటలను ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. వ్వవసాయ అధికారులు పరిశీలించి పంటనష్టం అంచనా వేసి నివేదిక ఇవ్వాలని గండ్ర ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చేతికందిన పంటలు వర్షంతో దెబ్బతిని నష్టపోయిన రైతులను సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. వ్యవసాయ అధికారులతో సర్వే చేయించి పంట నష్టం అంచనా నివేదికను సీఎంకు అందజేసి పరిహారం కోసం తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట మండల వ్వవసాయ ఆధికారి వాసుదేవరెడ్డి, జడ్పీటీసీ సాయిని విజయా ముత్యంరావు, లక్ష్మీనర్సింహస్వామి ఆలయ చైర్మన్ ఇంగే మహేందర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అంకం రాజేందర్, ఎంపీటీసీ అయిలు శ్రీధర్, ఎర్రబెల్లి రవీందర్, పీఏసీఎస్ వైస్ చైర్మన్ సామల పాపిరెడ్డి, నాయకులు పంచగిరి సుధాకర్, కోలెపాక భిక్షపతి, తదితరులు ఉన్నారు.