ఉచిత రవాణా, రంగులు, భోజన సౌకర్యం
విజేతలకు నగదు బహుమతులు
ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు
ముస్తాబైన కృష్ణకాలనీ అంబేద్కర్ స్టేడియం
హాజరుకానున్న మంత్రి సత్యవతి రాథోడ్
జయశంకర్ భూపాలపల్లి, జనవరి 8 (నమస్తే తెలంగాణ) : రైతుబంధు సంబురాల్లో భాగంగా ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా స్థాయి రైతుబంధు రంగోళి పోటీలు ఆదివారం కృష్ణకాలనీలోని అంబేద్కర్ స్టేడియంలో ఉదయం 10గంటలకు ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 11 మండలాల నుంచి భారీ సంఖ్యలో మహిళలు పాల్గొననున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. అంబేద్కర్ స్టేడియంలో సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ భారీ చిత్రాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి హాజరుకానున్నారు.
విజేతలకు నగదు బహుమతులు
రంగోళీ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, వరంగల్ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి నాయకత్వంలో నగదు బహుమతులను అందించనున్నారు. ప్రథమ బహుమతికి రూ. 5016, ద్వితీయ బహుమతిగా రూ. 3016, తృతీయ బహుమతిగా రూ.2016 నగదుతో పాటు జ్ఞాపికలు అందించనున్నారు. మరో పది మందికి కన్సోలేషన్ బహుమతులు, ముగ్గుల పోటీల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రోత్సాహక బహుమతులు ఇవ్వనున్నారు. పోటీల్లో పాల్నొ వారికి రంగులు, భోజనం, ఉచితంగా రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు.
ముస్తాబైన అంబేద్కర్ స్టేడియం
ముగ్గుల పోటీలకు అంబేద్కర్ స్టేడియం ముస్తాబైంది. స్టేడియంలో సిఎం కేసీఆర్, టీఆర్ఎస్ కార్యానిర్వహక అద్యక్షుడు కేటీఆర్లచిత్రాలు ఆకర్షణీయంగా రూపొందించారు. మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.