స్టేషన్ ఘన్పూర్, అక్టోబర్ 18 : దేశంలో ఎక్కడాలేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తున్నారని, వీటిని ప్రతి రైతుకు చేరేలా మార్కెట్ కమిటీ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య కోరారు. సోమవారం స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్లో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం నిర్వహించారు. అంతకు ముందు బస్టాండ్ నుంచి టీఆర్ఎస్ శ్రేణులు మార్కెట్ కార్యాలయం వరకు పటాకులు కాలుస్తూ ర్యాలీగా వచ్చారు. అనంతరం మార్కెట్లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎంవో నాగేశ్వరశర్మ మార్కెట్ నూతన కమిటీతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ వ్యవసాయదారులకు, వ్యాపారులకు మార్కెట్ పాలక వర్గం మధ్యవర్తిగా వ్యవహరించి సమస్యలు లేకుండా చూడాలన్నారు. పంటలకు మద్దతు ధరలు అమలయ్యేలా చర్యలు తీసుకోవడంతోపాటు మార్కెట్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. త్వరలోనే మార్కెట్ యార్డులో కమీషన్ ఏజంట్తోపాటు పశువుల అంగడి ఏర్పాటుకు కృషి చేస్తామని రాజయ్య తెలిపారు. గిట్టుబాటు ధర కల్పించేందుకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి డ బ్బులను నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తామన్నారు. కేంద్రం ధాన్యాన్ని తీసుకోమని చెప్పడంతో ఆందోళన చెందుతున్న రైతులకు సీఎం కేసీఆర్ తీపి కబురు చెప్పారన్నారు. దొడ్డు వడ్లను ప్రభుత్వ మే కొనుగోలు చేస్తుందని చెప్పడం ఆనందకరమన్నారు.
సీఎం కేసీఆర్తోనే రైతులకు న్యాయం : పసునూరి
ఏ రాష్ట్రంలో లేనివిధంగా సీఎం కేసీఆర్ తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికి దిక్సూచిగా నిలిచాయని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. సమైక్య రాష్ట్రంలో తాగు, సాగునీటికి ప్రజలు ఇబ్బందిపడ్డారని చెప్పారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్నారని వివరించారు. సముద్రంలో కలుస్తున్న గోదావరి జలాలను ఒడిసిపట్టి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, దీంతో లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జనగామ వ్యవసా మార్కెట్ చైర్పర్సన్ బాల్దె విజయ సిద్ధిలింగం, జీసీసీ మాజీ చైర్మన్ గాంధీనాయ క్, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ సేవెల్లి సంపత్, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, ఎంపిడీవో కుమారస్వామి, టీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇన్చార్జి లకావత్ చిరంజీవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్తోపాటు స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.