అవకతవకలకు సర్కారు చెక్
ప్రతి కొనుగోలు కేంద్రంలో ఐదుగురితో పర్యవేక్షణ
రైతులకు ఇబ్బందులు లేకుండా సంబంధిత అధికారుల చర్యలు
లింగాలఘనపురం, ఏప్రిల్ 13 : రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేసి దళారులకు చెక్ పెట్టి తెలంగాణ సర్కారు రైతులకు ఎలాంటి సమస్యలు రాకుండా చర్య లు తీసుకుంటున్నది. కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు చోటులేకుండా ఆదేశాలు జారీ చేసిం ది. మండలంలో గత సంవత్సరం ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల అవగాహనరాహిత్యంతో అవకతవకలు చోటు చేసుకున్నాయి. గన్నీ బ్యాగుల కొరతకు తోడు ధాన్యం మిల్లులకు తరలించకపోవడం, లారీల కొరత వంటి సమస్యలను రైతులు ఎదుర్కొన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలను ఎప్పటికప్పుడు తరలించకపోవడంతో రైతులకు డబ్బులు అందడంలో కొంత జాప్యం జరిగింది. ఇందుకు నిదర్శనమే మండలంలోని ఓ ఐకేపీ కేంద్రంలో లారీ లోడ్ ధాన్యం ట్రక్షీట్ గల్లంతై దాదాపు నాలుగు నెలల వరకూ ధాన్యం విక్రయించిన రైతులకు బిల్లులు రాలేదు. దీంతో సంబంధిత మహిళా గ్రూపు ఆ నష్టాన్ని భరించి రైతులకు డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఇకపై ఇలాంటి సమస్యలు రాకుండా సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ యాసంగిలో రైతులకు ఎలాంటి ఇ బ్బందులు లేకుండా చర్యలు చేపట్టారు. ఐకేపీ అధ్వర్యం లో ఏర్పాటు చేయనున్న ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సంబంధిత అధికారిని ఇన్చార్జిగా ఏర్పాటు చేస్తున్నారు. డ్వాక్రా గ్రూపునకు చెందిన ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిస్తున్నారు. వీరిలో ఒకరు గన్నీ బ్యాగుల బాధ్యతను, మరొకరు కాంటాల వద్ద కొనుగోలును పరిశీలిస్తారు. మరొకరు రికార్డుల పరిశీలన, ఇంకొరు లారీల రాకపోకల పర్యవేక్షణ, మరొకరు ట్రక్షీట్ల వ్యవహారాన్ని పరిశీలిస్తారు. ఈసారి మండలంలో ఐకేపీ అధ్వర్యంలో 12 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. డ్వాక్రా గ్రూపుల నుంచి ఎంపిక చేసిన 60 మంది మహిళలకు జనగామ కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై త్వరలో శిక్షణ ఇవ్వనున్నారు.
కమిటీ సభ్యులకు శిక్షణ
మండలంలో ధాన్యం కొనుగోలుకు 12 గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు న్నాం. ఒక్కో కేంద్రానికి ఐకేపీకి చెందిన అధికారి ఇన్చార్జిగా వ్యవహరిస్తారు. డ్వాక్రాగ్రూపునకు చెందిన ఐదుగురు మహిళలతో కమిటీ వేశాం. ఈ కమిటీలకు కలెక్టరేట్లో శిక్షణ ఇప్పించి కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం.
-శంకరయ్య, ఐకేపీ ఏపీఎం