హరితహారంతో వనంలా మారిన రామన్నగూడెం
ప్రత్యేక ఆకర్షణగా పల్లె ప్రకృతి వనం
రోడ్డుకు ఇరువైపులా ఆహ్లాదం పంచుతున్న చెట్లు
నర్సింహులపేట, అక్టోబర్ 9: వనాలను వృద్ధి చేసి జనాలను పచ్చని వాతావరణం అందించాలన్న రాష్ట్ర సర్కార్ సంకల్పం నెరవేరుతున్నది. 2015లో మహాయజ్ఞంలా ప్రారంభమైన హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సా గుతుండడంతో పుడమి పచ్చబడింది. రోడ్లకిరువైపులా, ఖాళీ ప్రదేశాల్లో ఏపుగా పెరిగిన చెట్లుతో పల్లెలు ఆకుపచ్చని లోగిళ్లుగా మారాయి. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలోని రామన్నగూడెం గ్రామం హరితహారం ఫలాలను అనుభవిస్తున్నది. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో గ్రామంలో ఇప్పటివరకు 20వేల మొక్కలు నాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వాటిలో 85శాతం మొక్కలు ఏపుగా పెరిగి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణంతోపాటు స్వచ్ఛమైన గా లిని అందిస్తున్నాయి. రోడ్లకిరువైపులా నాటిన మొక్కలు పెరిగిపెద్దవై వాహనదారులకు స్వాగతం పలుకుతున్నాయి. సుమారు వెయ్యి మొక్కలతో రూపుదిద్దుకున్న పల్లె ప్రకృతివనం గ్రామానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. గ్రామంలో కోతులబెడద నివారణకు శివారులోని పైలగుట్టపై 1200 మొక్కలు నాటారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్తో ప్రతి రోజూ వాటికి నీళ్లుపడుతూ రక్షిస్తున్నారు.
పల్లెప్రకృతి వనం మా ఊరి ప్రత్యేకత
మా ఊరిలో ప్రతి వీధి మొక్కలతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. రాజమండ్రి నుంచి మొక్కలు తెప్పించి నాటినం. సుమారు వెయ్యి మొక్కలతో రూపుదిద్దుకున్న పల్లెప్రకృతివనం మా ఊరికి ప్రత్యేక ఆకర్షణ. గ్రామస్తుల సహకారంతో హరితహారం మొక్కలను సంరక్షిస్తున్నాం.
పచ్చబడిన జయపురం పాఠశాల
నర్సింహులపేట మండలంలోని జయపురం గ్రామ ప్రభుత్వ పాఠశాల హరితహారం మొక్కలతో ఆకుపచ్చగా రూపుదిద్దుకున్నది. రెండో విడుత హరితహారంలో పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసి సుమారు 300 మొక్కలు నాటి సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. పూలు, పండ్ల మొక్కలను విద్యార్థులు దత్తత తీసుకుని ప్రతి రోజూ నీళ్లు పోసి రక్షించారు. ఇప్పుడవి పెరిగి పెద్దవయ్యాయి. పాఠశాల ప్రాంగణం పచ్చని చెట్లతో కనువిందు చేస్తున్నది. ఆహ్లాదకర వాతావరణంలో విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారు. పచ్చని చెట్ల కింద ప్రతి రోజూ విద్యార్థులకు యోగా నేర్పిస్తున్నారు.
ఆహ్లాదకర వాతావరణంలో..
హరితహారం మొక్కలతో పాఠశాల ప్రాంగణం పచ్చబడింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. పచ్చటి ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల ప్రాంగణ సుందరీకరణకు గ్రామస్తులతోపాటు ప్రజాప్రతినిధులు సహకరించారు. ప్రతి రోజూ సాయంత్రం విద్యార్థులకు యోగా నేర్పిస్తున్నాం.