కొత్త జిల్లాగా అవతరించిన ములుగులో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నాయి. గతంలో పంచాయతీగా ఉన్న ఈ ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తామని 2018లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్, అన్నమాట ప్రకారం 2019లో ఆచరణలో చూపారు. అన్ని జిల్లాలతో సమానంగా నిధులు విడుదల చేస్తూనే, అధికారులను కేటాయించి అత్యుత్తమ జిల్లాగా తీర్చిదిద్దుతున్నారు. తాత్కాలికంగా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేసి 80 శాతం మేర ఇతర శాఖల కార్యాలయాలను పూర్తిచేయించారు. వ్యాపార, వాణిజ్య పరంగానే కాకుండా అన్ని రంగాల్లో వృద్ధికి బాటలు వేశారు. స్థానిక దవాఖానను 250 పడకలకు పెంచి ఇటీవల రూ.40కోట్లు సైతం విడుదల చేశారు. కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణానికి స్థలం కేటాయించి నిధులు కేటాయించారు.
రాష్ట్రంలో 33వ జిల్లాగా ఏర్పడిన ములుగు అభివృద్ధి లో దూసుకుపోతున్నది. గతంలో గ్రామ పంచాయ తీగా ఉండగా సీఎం కేసీఆర్ 2018 నవంబర్ 30న జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ములుగును జిల్లాగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అన్నమాట ప్రకారం తన పుట్టిన రోజు కానుకగా 2019 ఫిబ్రవరి 17న 9 మండలాలతో ములుగును జిల్లాగా ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాలతో సమానంగా నిధులు, అధికారులను కేటాయించి అభివృద్ధికి బాటలు వేశారు. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలను తాతాలికంగా ఏర్పాటు చేసి 80 శాతం మేర ఇతర శాఖల కార్యాలయాలను ఏర్పాటు చేసి అధికారులను కేటాయించారు.
జిల్లాగా ఏర్పడిన అనంతరం ములుగు ప్రాంతం ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో అభివృద్ధి చెందుతూ వాణిజ్య పరంగా వృద్ధిని సాధించింది. సమీకృత కలెక్టరేట్ నిర్మాణం కోసం గట్టమ్మ దేవాలయం పక్కన ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద 50 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించి భవన నిర్మాణాల కోసం నిధులను విడుదల చేసింది. ఎస్పీ కార్యాలయం కోసం జాకారం గ్రామం వద్ద ఉన్న పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద స్థలాన్ని సేకరించారు. త్వరలో నిర్మాణ పనులను కూడా ప్రారంభించే ఏర్పాట్లు చేశారు. శాశ్వత ప్రాతిపతికన విద్యాశాఖ కార్యాలయానికి చెందిన పురాతన భవనానికి మరమ్మతులు చేసి వివిధ కార్యాలయాల కోసం కేటాయించి సంక్షేమ భవన్గా మార్చారు.
ప్రత్యేక జిల్లాగా మారిన తర్వాత 50 పడకలుగా ప్రభుత్వ దవాఖానకు స్థాయిని పెంచి వంద పడకల మార్చి వైద్య సేవలు అందిస్తున్నారు. మళ్లీ దాని స్థాయిని పెంచి 250 పడకలుగా మార్చారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద 10 ఎకరాల స్థలాన్ని కేటాయించి రూ.40 కోట్ల నిధులతో అన్ని సౌకర్యాలతో కొత్త ఆస్పత్రి నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామంలో ఫోర్త్ బెటాలియన్ తో పాటు ములుగు మండలం ఇంచర్ల గ్రామం వద్ద సీఆర్పిఎఫ్ బేస్ క్యాంప్నుఏర్పాటు చేశారు. జిల్లా ఏర్పడిన తర్వాత పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాల నిర్మాణాలు కూడా ఊపందుకున్నాయి అందులో భాగంగా కలెక్టరేట్ పకన రెవెన్యూ గెస్ట్హౌస్, ఈవీఎంల గిడ్డంగి, బండారుపల్లి రోడ్డులో సహకార సంఘ కార్యాలయ భవనం, డిగ్రీ కళాశాల రోడ్డులో ఆర్అండ్బీ గెస్ట్ హౌస్, ఐసీడీఎస్ కార్యాలయ భవన నిర్మాణ పనులు పూర్తి దశకు చేరాయి. అలాగే పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ కార్యాలయ ఆవరణలో వివిధ శాఖల కోసం భవన నిర్మాణం చేపట్టగా పనులు పూర్తి దశకు చేరుకున్నాయి.