ఆక్సిజన్ సిలిండర్లు, మందుల స్టాక్, కరోనా బాధితులకు పడకలపై పరిశీలన
జనగామ చౌరస్తా, మే 1 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన దవాఖానతోపాటు చంపక్హిల్స్లో మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో వైద్య సౌకర్యాలపై అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్తోపాటు అధికారులు ఆరా తీశారు. ఈ మేరకు సంబంధిత అధికారులు శనివారం దవాఖానలను సందర్శించి రోగులతో మాట్లాడారని ఆర్ఎంవో డాక్టర్ పగిడిపాటి సుగుణాకర్ రాజు తెలిపారు. ప్రభుత్వ దవాఖానలో కరోనా రోగులకు అందిస్తున్న వైద్య సేవలతో పాటు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ ఇంజెక్షన్ల స్టాకు వివరాలను తెలుసుకున్నారు. ఈ మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారి రాంరెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి తనిఖీ చేశారని సుగుణాకర్రాజు విలేకరులకు తెలిపారు. జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ తనిఖీ చేసి రోగుల వివరాలు తెలుసుకున్నారు. దవాఖానలో మందుల స్టాకు వివరాలు, రికార్డులను పరిశీలించారు. కరోనా పేషెంట్లకు ఇబ్బందులు రాకుండా వైద్య చికిత్స అందించాలని అబ్దుల్ హమీద్ వైద్యులకు సూచించారు. దవాఖానలో ఆక్సిజన్ సిలిండర్లు, రెమిడెసివిర్ ఇంజెక్షన్ల కొరత లేదని ఆయన పేర్కొన్నారు. ఆర్ఎంవో డాక్టర్ సుగుణాకర్ రాజు, జిల్లా ప్రధాన దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ పూజారి రఘు విలేకరులతో మాట్లాడుతూ జనగామ జిల్లా ప్రభుత్వ ప్రధాన దవాఖానలో శనివారం కరోనా రోగులకు అవసరమైన జనరల్ బెడ్స్ 33 అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కొవిడ్ ఐసీయూ. వెంటిలేటర్ బెడ్స్, వితౌట్ వెంటిలేటర్ బెడ్స్లో రోగులకు వైద్య సేవలందిస్తున్నామని చెప్పారు.