షాబాద్, జూన్ 28 : అర్హులకు సబ్సిడీ రుణాలు అందేలా కృషి చేస్తున్నట్లు ఎంపీపీ ప్రశాంతిరెడ్డి, ఎంపీడీవో అనురాధ తెలిపారు. సోమవారం మండల పరిషత్తు కార్యాలయం సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. 88 మందికి గాను 44 మంది హాజరయ్యారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..2020-21కి గాను షాబాద్ ఎస్బీఐ పరిధిలోకి వచ్చే లబ్ధిదారులకు ఎస్సీ కార్పొరేషన్ రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. నిరుద్యోగ యువతకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రుణాలు తీసుకుని ఉపాధి పొందాలని సూచించారు. వివిధ రకాలుగా యూనిట్ల వారీగా రుణాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీవో హన్మంత్రెడ్డి, ఎపీఎం నర్సింహులు, బ్యాంకు సిబ్బంది రామస్వామి, అభిలాష్ పాల్గొన్నారు.
శానిటైజర్లు అందజేత..
గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని ఎంపీపీ ప్రశాంతిమహేందర్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని రుద్రారంలో సర్పంచ్ స్వర్ణలతతో కలిసి పద్మావతి మహిళ అభ్యుదయ సంఘం, వెల్స్పన్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రజలకు మాస్కులు, శానిటైజర్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు మంచి ఫలితాలు ఇచ్చిన్నట్లు చెప్పారు. కొవిడ్ కేసులు తగ్గినా ప్రజలు నిర్లక్ష్యం వహించకుండా మాస్కు ధరిస్తూ, భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్సింహులు, కంపెనీ ప్రతినిధులు సురేశ్, శ్రీనివాసులు, కార్యదర్శి ఫసీ తదితరులు పాల్గొన్నారు.