ముస్తాబైన ఆలయం
నేటి నుంచి 13 రోజులపాటు వేడుకలు
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రవి
పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశం
ధర్మపురి, మార్చి 23: ధర్మపురి శ్రీలక్ష్మీనర్సింహస్వామి బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. నేటి నుంచి 13 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించనుండగా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా 24న ఉదయం 11గంటలకు యజ్ఞాచార్యుల ఆహ్వానం, విష్వక్సేన, వాసుదేవ పుణ్యాహవాచనం, బ్రహ్మ కలశ స్థాపన, అంకురార్పణ, వరాహ తీర్థం, సాయంత్రం పుట్ట బంగారం తెచ్చే కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లుండాలి: కలెక్టర్ రవి
భక్తులకు ఇబ్బందులు కలుగకుండా బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను కలెక్టర్, ఆయా శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. దేవాలయ ప్రాంగణంతో పాటు, గోదావరి, బ్రహ్మ పుష్కరిణి తదితర ప్రాంతాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. గోదావరి, దేవాలయం, మున్సిపల్ కార్యాలయం వద్ద హెల్త్క్యాంపులు 13 రోజుల పాటు నిర్వహించాలన్నారు. పట్ణణంలోని అన్ని వీధుల్లో, దేవాలయ పరిసరాల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు నిర్వహించాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. 13 రోజులపాటు విద్యుత్ సరాఫరాలో అంతరాయం లేకుండా చూసుకోవాలని ఏఈ మనోహర్ను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదించి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలని దేవస్థానం ఈవోను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఎస్పీ సింధూశర్మ, అదనపు కలెక్టర్ రాజేశం, ఎంపీడీవో నరేశ్, దేవస్థానం ఈవో శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ సంపత్, డీటీ సుమన్, ఆయాశాఖల అధికారులు ఉన్నారు.