మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల టెండర్లు (2023-25) రెండేండ్లకు గానూ టెండర్ల ప్రక్రియ గడువు శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన టెండర్ల ప్రక్రియకు దరఖాస్తులు అధికంగా వచ్చాయి. ఈ పాలసీ 2023 డిసెంబర్ 1 నుంచి 2025 నవంబర్ 30 వరకు అమలులో ఉంటుంది. కొత్త పాలసీలో ఉమ్మడి జిల్లాలో 230 దుకాణాలకు ఈ ఏడాది రూ.171కోట్ల 88లక్షలు 94వేలకు పైగా ఆదాయం వచ్చింది. ఈ నెల 21న లక్కీడిప్ ద్వారా దుకాణాలను కేటాయిస్తారు. దుకాణం దక్కించుకున్నవారు వెంటనే ఏడాది లైసెన్స్ ఫీజులో 1/6 వంతు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఆరు విడతల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాలి. మరుసటి ఏడాది కూడా ఆయా విడతల్లో లైసెన్స్ ఫీజు మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. డిసెంబర్ 1 నుంచి టెండర్లలో దక్కించుకున్న వారికి దుకాణాలను కేటాయిస్తారు. ప్రతీ మద్యం దుకాణం పక్కనే పర్మిట్గది కోసం రూ.2లక్షలు కచ్చితంగా చెల్లించాల్సి ఉంటుంది. ఉమ్మడి జిల్లాలో 230 దుకాణాలున్నాయి. మహబూబ్నగర్, నారాయణపేటలో 90, నాగర్కర్నూల్లో 51, వనపర్తిలో 37, గద్వాలలో 36 దుకాణాలున్నాయి. వీటిలో 30 శాతం రిజర్వేషన్ కోటా కాగా మిగతావి ఓపెన్ కేటాగిరి కావడం విశేషం.
మద్యం దుకాణాల టెండర్లకు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని జిల్లాలో కలిపి ఇప్పటి వరకు 8,595 ధరఖాస్తులు వచ్చాయని ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ దత్తరాజ్ గౌడ్ గురువారం తెలిపారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో మద్యం దుకాణాల దక్కించుకునేందుకు ఆశావాహులు పెద్ద సంఖ్యలో టెండర్ల వేస్తున్నారు. టెండర్లలో ఈ ఏడాది గత ఏడాది కంటే ఎక్కువగా ధరఖాస్తులు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న 230 మద్యం దుకాణాలకు శుక్రవారం రాత్రి 11గంటల వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. 8,595 టెండర్లు దాఖలు కాగా ఉమ్మడి జిల్లా నుంచి ధరావత్తు సొమ్ము దాదాపు రూ. 171 కోట్ల 88 లక్షలు ప్రభుత్వ ఖాజానాలో జమకానుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ఒక్క రోజే 3,898 టెండర్లు రాగా అందులో మహబూబ్నగర్, నారాయణపేట కలిపి వరకు 1,439 మొత్తం 3,571, నాగర్కర్నూల్ 1,311 మొత్తం 2,524 , గద్వాల 478 మొత్తం 1,171, వనపర్తి 670 మొత్తం 1,329 రాగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 8,595 దరఖాస్తులు వచ్చాయని ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ డీసీడీసీ తెలిపారు.