Measles | జింబాబ్వేలో మీజిల్స్ సోకండంతో గత ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు సుమారు 700 మంది చిన్నారులు మీజిల్స్ బారిన పడ్డారని ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. కనుక దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా వ్యాక్సినేషన్ చేయాలన్న డిమాండ్ పెరుగుతున్నది. అవసరమైతే చట్టం సవరించాలని ప్రజానీకం కోరుతున్నారు. జింబాబ్వేలో మీజిల్స్ కేసులు భారీగా నమోదు కావడంతోపాటు దీని బారిన పడి మృత్యువాత పడటంపై యునిసెఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.
గత ఏప్రిల్ తొలి వారం జింబాబ్వేలోని మనీకాల్యాండ్ రాష్ట్ర పరిధిలో మీజిల్స్ వ్యాధి గుర్తించారు. తర్వాత కొద్ది వారాల్లోనే దేశమంతా వ్యాపించింది. ఇప్పటికే 6,291 మీజిల్స్ కేసులు నమోదయ్యాయి. 698 మంది చిన్నారులు మీజిల్స్ బారీన పడి మృతి చెందారు. ఈ నెల ఒక్కరోజే 37 మంది ప్రాణాలు కోల్పోయారని జింబాబ్వే ఆరోగ్యశాఖ ఆందోళన వ్యక్తం చేసింది. 15 రోజుల క్రితం వరకు 157 మంది మాత్రమే మరణించగా, ఇప్పుడు ఆ సంఖ్య నాలుగురెట్లు పెరగడం ప్రజల్లో ఆందోళనకు కారణమవుతున్నది.
జింబాబ్వేలో మత విశ్వాసాల వల్లే పలు కుటుంబాలు టీకాలకు దూరంగా ఉన్నాయని నివేదికలు ఉన్నాయి. ఇటీవలి మృతుల్లో అధికులు టీకాలు తీసుకోని వారేనని జింబాబ్వే సమాచారశాఖ మంత్రి మొనైకా ముత్సవాంగ చెప్పారు. కనుక ప్రతి ఒక్కరికి టీకా తప్పనిసరి చేయాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వ్యాక్సిన్ పట్ల ప్రజల్లో అవగాహన పెంచాలని జింబాబ్వే మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు జొహన్నస్ మరిసా తెలిపారు. 6 నెలలు-15 ఏండ్ల మధ్య వయస్సు గల పిల్లలందరికి తప్పనిసరిగా మీజిల్స్ టీకా వేయాల్సిందేనన్నారు.
దగ్గు, తుమ్ముతో వచ్చే అంటు వ్యాధుల్లో మీజిల్స్ ఒకటి. దగ్గుతోపాటు జ్వరం వస్తుంది. చర్మంపై దుద్దుర్లు కూడా వస్తాయి. పౌష్టికాహార లోపంతో బాధపడే చిన్నారుల్లో ఈ అంటు వ్యాధి వ్యాపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.