కాబూల్ : ఒసామా బిన్ లాడెన్ మరణం తర్వాత అల్ఖైదా బాధ్యతలు చేపట్టిన ఈజిప్ట్ సర్జన్ అల్ జవహరి అమెరికన్ దళాల డ్రోన్ దాడిలో మరణించిన తర్వాత ఉగ్రసంస్ధ వారసుడెవరనే దానిపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. అల్ఖైదా తదుపరి చీఫ్గా సైఫల్ అదెల్, అబ్దల్ రహ్మీన్ అల్ మగ్రెబి, యాజిద్ మెబ్రాక్లలో ఒకరు ఉగ్ర సంస్ధ పగ్గాలు చేపట్టవచ్చని భావిస్తున్నారు. జవహరి వారసుడిపై అల్ఖైదాలో ఇప్పటివరకూ స్పష్టమైన ప్రణాళిక లేదని చెబుతున్నారు.
ఆప్ఘనిస్ధాన్ను తాలిబన్లు ఇటీవల తమ చేతుల్లోకి తీసుకోవడంతో ఇప్పట్లో తాలిబన్లపై అంతర్జాతీయ ఒత్తిళ్లు ఉండేలా ఉగ్ర ప్రణాళికలతో చెలరేగాలని అల్ఖైదా భావించకపోవడంతో ఉగ్ర సంస్ధ నుంచి ఇప్పటికిప్పుడు అంతర్జాతీయ సమాజానికి ముప్పు ఉండబోదని అమెరకా భావిస్తోంది. సంస్ధాగత నిర్మాణం, నెట్వర్క్ పటిష్టం చేసుకునేందుకూ అల్ఖైదా వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గుతుంది. మరోవైపు గ్లోబల్ జిహాద్గా గుర్తింపు పొందేందుకు ఇదే సరైన సమయమని కూడా అల్ఖైదా యోచిస్తోంది.
ఇక కాబూల్పై చేసిన ఎయిర్స్ట్రైక్స్లో అల్జవహరి హతమైనట్లు అగ్రరాజ్యం ప్రకటించింది. న్యాయం జరిగిందని, ఈ ఉగ్రవాద నేత ఇక లేడని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ప్రకటించారు. ‘‘అల్ఖైదా నేత అల్జవహరి హతమయ్యాడు. అమెరికా ప్రజలకు హాని కలిగిస్తే ఎక్కడున్న వదలం. ఎంతకాలమైనా ఎక్కడ దాక్కున్నా మట్టుబెడతాం’’ అని బైడెన్ వార్నింగ్ ఇచ్చారు.