Raghuram Rajan | వాషింగ్టన్, ఏప్రిల్ 17: అధిక జనాభా ద్వారా కలిగే ప్రయోజనాలను భారత్ అందిపుచ్చుకోవడం లేదని, యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోవడమే ఇందుకు కారణమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ పేర్కొన్నారు. ఇప్పటికైనా మానవ వనరులను మెరుగుపరచడం, వారి నైపుణ్యాలను పెంచడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అమెరికాలోని జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీలో జరిగిన ఓ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారతీయ ఆవిష్కర్తలు ఎందుకు సింగపూర్ లేదా సిలికాన్ వ్యాలీకి వెళ్తున్నారని అడిగిన ప్రశ్నకు రఘురామ్ రాజన్ బదులిస్తూ..
తాము ప్రపంచంలో ఎవరికీ తక్కువ కాదనే విరాట్ కోహ్లీ మనస్తత్వంతో భారతీయ యువత ఉందని, ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని వారనుకుంటున్నారని పేర్కొన్నారు. భారత్లోనే ఉండకుండా బయటకు వెళ్లేందుకు ఎవరు ఎందుకు మొగ్గు చూపుతున్నారో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. తాను ఇలాంటి కొందరితో మాట్లాడినప్పుడు.. వారు ప్రపంచాన్ని మార్చాలని అనుకుంటున్నట్టు చెప్పారన్నారు. భారత్లో యువత సంతోషంగా నివసించలేకపోతున్నారని రాజన్ అన్నారు. దేశంలో నిరుద్యోగం చాలా ఎక్కువగా ఉందని, రైల్వేలో ప్యూన్ ఉద్యోగాలకు పీహెచ్డీ చేసినవారు దరఖాస్తు చేస్తున్నారని తెలిపారు.