రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోదిమిర్ జెలెన్స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాశ్చాత్య దేశాలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక వీడియోను పోస్ట్ చేశారు. తాజాగా ఉక్రెయిన్లోని వినిట్సియా ఎయిర్పోర్టును రష్యా మిస్సైల్స్ ధ్వంసం చేశాయి. ఇదే విషయాన్ని జెలెన్స్కీ కూడా ప్రస్తావించారు.
‘‘వినిట్సియాపై జరిగిన దాడికి సంబంధించిన రిపోర్టు ఇంతకు ముందే నా చేతికి వచ్చింది. ప్రశాంతంగా ఉండి, రష్యాకు ఎటువంటి హాని కలిగించని వినిట్సియాపై మొత్తం ఎనిమిది మిసైల్స్ వేశారు. ఈ క్రూరమైన దాడి ఎయిర్పోర్టును పూర్తిగా నాశనం చేసేసింది. వాళ్లు మన మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. తరతరాలుగా ఉక్రెయిన్ ప్రజలు నిర్మించుకున్న జీవితాలపై దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు’’ అంటూ రష్యా దాడిపై స్పందించారు.
అక్కడితో ఆగకుండా ‘‘ఉక్రెయిన్ ఎయిర్స్పేస్ను మూసేయాలని మేం ప్రతిరోజూ విన్నపాలు చేస్తూనే ఉన్నాం. రష్యన్ మిసైల్స్, రష్యా యుద్ధ విమానాలు, ఈ టెర్రరిస్టులు రాకుండా మా దేశపు ఆకాశాన్ని మూసేయండి. బాంబులు, మిసైల్స్ లేని హ్యూమానిటేరియన్ ఎయిర్జోన్ ఏర్పాటు చేయండి. మేమంతా మనుషులం.. మమ్మల్ని అంటే మనుషులన్ని కాపాడటం మీ మానవతా విధి. మీరు ఆ పని చేయగలరు. అయినా మీరు చేయడం లేదంటే.. కనీసం మమ్మల్ని మేం కాపాడుకోవడానికి కూడా ఎయిర్క్రాఫ్ట్లు ఇవ్వడం లేదంటే దాని అర్థం ఒకటే. మీరు కూడా మేం నెమ్మదిగా చచ్చిపోవాలని కోరుకుంటున్నారు’’ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమను కాపాడటం ఎప్పటికీ ప్రపంచ రాజకీయ వేత్తలు, వెస్ట్ (పాశ్చాత్య దేశాల) నాయకుల బాధ్యతే అని అన్నారు.
Breaking! pic.twitter.com/VCL5mpOVMi
— Володимир Зеленський (@ZelenskyyUa) March 6, 2022