కొలంబో: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న తమకు ఆర్థిక సహాయం (Financial Assistance) చేసినందుకు శ్రీలంక (Sri Lanka) పార్లమెంటు స్పీకర్ మహింద యాపా అబేవర్ధనా (Mahinda Yapa Abeywardena) భారత్కు ధన్యవాదాలు తెలిపారు. న్యూఢిల్లీ (New Delhi) కొలంబో (Colombo)కు సన్నిహిత సహచరుడని (Close associate), విశ్వసనీయ స్నేహితుడని (Trustworthy friend) అభివర్ణించారు. ఆర్థిక సంక్షోభంలో (Economic crisis) కూరుకుపోయిన తమను భారత్ రక్షించింది. లేనట్లయితే తామందరికి మరో రక్తపాతం ఉండేదని చెప్పారు. కొలంబోలోని ఇండియన్ ట్రావెల్ కాంగ్రెస్ ప్రతినిధుల కోసం ఏర్పాటు చేసిన ఒక పార్టీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సాంస్కృతికంగా, జాతీయంగా, విధానపరంగా శ్రీలంక, భారత్ ఒకదానితో ఒకటి అనుసంధానించబడ్డాయని తెలిపారు. అన్నింటికంటే ప్రధానంగా భారతదేశం శ్రీలంకకు చాలా సన్నిహిత సహచరుడని, అత్యంత నమ్మదగిన మిత్రుడని చెప్పారు. తమ దేశంలో ఇబ్బందుల్లో ప్రతిసారి భారత్ సహాయం అందిస్తున్నదని గుర్తుచేశారు.
కాగా, విదేశీ మారక నిల్వలు అడుగంటిపోవడంతో ద్వీపదేశమైన శ్రీలంక గతేడాది తీవ్ర ఆర్థిక సంక్షోభానికి గురైంది. దీనికి రాజకీయ అస్థిరత తోడవడంతో పరిస్థితి దయనీయస్థితికి చేరింది. ఆహార, చమురు నిల్వలు నిండుకోవడంతో నిత్యావసరాల కోసం ప్రజలు రోజుల తరబడి లైన్లలో నిలబడాల్సి వచ్చింది.
ఈ నేపథ్యంలో కష్టాల్లో కూరుకుపోయిన పొరుగు దేశానికి భారత్.. నైబర్హుడ్ ఫస్ట్ విధానానికి అనుగుణంగా క్రెడిట్ లైన్లు, కరెన్సీ అందించడంతోపాటు వ్యాగన్ల కొద్ది నిత్యావసరాలు, ముడి చమురును అందించింది. ఇలా మొత్తంగా గతేడాది దాదాపు 4 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర సహాయం చేసిన విషయం తెలిసిందే. 1948లో బ్రిటన్ నుంచి స్వాతంత్య్రం పొందిన తర్వాత శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం ఇదే తొలిసారి.