బీజింగ్: చైనా అధ్యక్షుడిగా షీ జిన్పింగ్ మరోసారి ఎన్నికయ్యారు. దీంతో వరుసగా మూడోసారి దేశ పగ్గాలు చేపట్టిన వ్యక్తిగా ఆయన నిలిచారు. దేశాన్ని పాలించే ఏడుగురు సభ్యుల స్టాండింగ్ కమిటీ జిన్పింగ్ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. దీంతో పార్టీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తరువాత తిరిగి అంతటి శక్తిమంతుడైన అధినాయకుడిగా 69 ఏండ్ల జిన్పింగ్ నిలిచారు. ఈ సందర్భంగా స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి జిన్పింగ్ మీడియాతో మాట్లాడారు.
ప్రపంచం లేకుండా చైనా అభివృద్ధి చెందలేదని, అదేసమయంలో చైనా అవసరం కూడా ప్రపంచానికి ఉందని చెప్పారు. గత నలభై ఏండ్లలో చేపట్టిన ఆర్థిక సంస్కరణలతో వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని, దీర్ఘకాలిన సామాజిక సుస్థిరతను చైనా సాధించిందన్నారు. భవిష్యత్తులోనూ మరింత సమష్టిగా నడపడానికి కృషిచేస్తామని చెప్పారు. పార్టీ పతాకాన్ని అత్యున్నత స్థానంలో ఉంచామని తెలిపారు. చైనాను అన్నిరకాలు ఆధునిక సోషలిస్టు దేశంగా మార్చేందుకు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేస్తామన్నారు. తనకు అత్యంత సన్నిహితుడైన లీ కియాంగ్ను చైనా కొత్త ప్రీమియర్గా (ప్రధాని) జిన్పింగ్ ప్రకటించారు. కాగా, చైనా సెంట్రల్ మిలిటరీ కమిషన్ అధినేతగా కూడా జిన్పింగ్ ఎన్నికయ్యారు. రెండుసార్లు మాత్రమే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలన్న కమ్యూనిస్టు పార్టీ నియమాన్ని 2018లో రద్దు చేసిన విషయం తెలిసిందే.