Global Dream 2 Cruise Ship | ప్రపంచంలోనే అతి పెద్ద నౌక అది ! ఆ పడవలో ఉన్నసదుపాయాలు ఇంకా ఎందులోనూ లేవు. అందులో తొలిసారి ప్రయాణించడం తమ భాగ్యమని ఎంతోమంది కలలు కన్నారు. కానీ ఏం లాభం !! తొలి ప్రయాణం చేస్తుండగా మధ్యలోనే ఓ మంచు పర్వతాన్ని ఢీకొట్టి సముద్ర గర్భంలో కలిసిపోయింది. వందేండ్ల క్రితం సముద్ర గర్భంలో కలిసిపోయిన టైటానిక్ కథ ఇది !! కానీ ఇప్పుడు వరల్డ్ రికార్డు సాధించడమే లక్ష్యంగా తయారైన ఓ భారీ షిప్.. తొలి ప్రయాణం కూడా చేయకముందే కనుమరుగు కాబోతోంది.
టైటానిక్ను మించిన ఈ భారీ నౌక పేరు గ్లోబల్ డ్రీమ్-2. జర్మనీకి చెందిన వెర్ఫ్టెన్ సంస్థ తయారు చేస్తోంది. ఇప్పటికే గ్లోబల్ డ్రీమ్-1 పూర్తిగా సిద్ధమవ్వగా.. దానికంటే పెద్దగా గ్లోబల్ డ్రీమ్ 2 షిప్ను నిర్మిస్తోంది. 20 అంతస్తులతో దాదాపు 9 వేల మంది ప్రయాణికులు ప్రయాణించే వీలుగా వెర్ఫెటెన్ సంస్థ ఈ షిప్ నిర్మాణాన్ని చేపట్టింది. ఆరుబయట స్విమ్మింగ్పూల్, విశాలమైన సినిమా థియేటర్ వంటి భారీ హంగులు ఉండేలా ప్లాన్ చేసింది. ఇన్ని అట్టహాసాలతో షిప్ నిర్మాణం పూర్తి కావడానికి 120 కోట్ల పౌండ్లు ( రూ.11,090 కోట్లు ) అవుతుందని అంచనా వేసింది.
ప్రపంచ రికార్డు సాధించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ చేపట్టిన వెర్ఫ్టెన్ సంస్థ నిర్మాణంలో ఎక్కడా రాజీ పడలేదు. బ్యాంకుల నుంచి ఎడాపెడా రుణాలు తీసుకుని నిర్మాణాన్ని మొదలుపెట్టింది. క్రూయిజ్ షిప్ నిర్మాణం దాదాపు పూర్తి అయ్యే సమయానికి రూ.9వేల కోట్లు ఖర్చయిపోయాయి. తుదిమెరుగులు దిద్ది నౌకను సముద్ర ప్రయాణానికి సిద్ధం చేయాలంటే.. ఇంకా 3 వేల కోట్ల వరకు అవసరం ఉంటుంది. కానీ ఇప్పటికే వెర్ఫ్టెన్ సంస్థ దగ్గర నిధులన్నీ ఖాళీ అయిపోయాయి. మిగిలిన నిర్మాణానికి కావాల్సిన డబ్బులను సమకూర్చడంలో సంస్థ విఫలమైంది.
నిజానికి కరోనా కూడా ఈ ప్రాజెక్ట్ను దెబ్బతీసిందని చెప్పొచ్చు. ఎందుకంటే భారీ ప్రాజెక్ట్ను వెర్ఫ్టెన్ సంస్థ కరోనా కంటే ముందు ప్రారంభించింది. దీని నిర్మాణం సగం పూర్తయిన తర్వాత ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టింది. కొవిడ్ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే సాధారణ జీవితానికి అలవాటుపడ్డ జనాలు.. పూర్తిగా జనాల్లో కలిసేందుకు జంకుతున్నారు. ఈ కారణంగా భారీ క్రూయిజ్ షిప్లకు డిమాండ్ లేకుండా పోయింది. ఈ కారణంగా కరోనా కంటే ముందు ఈ షిప్ను కొనేందుకు పోటీపడ్డ కంపెనీలు.. ఇప్పుడు చేతులెత్తేశాయి. ఒకవైపు షిప్ అమ్ముడుపోక.. మరోవైపు అప్పులిచ్చిన బ్యాంకుల నుంచి ఒత్తిడి పెరగడంతో దివాళా తీస్తున్నట్లు వెర్ఫ్టెన్ కంపెనీ ఈ ఏడాది మొదట్లో ప్రకటించింది.
దివాళా తీస్తున్నట్లు ప్రకటించిన తర్వాత వెర్ఫ్టెన్కు చెందిన షిప్యార్డ్, నౌకల తయారీ కర్మాగారాన్ని తైసన్క్రూప్ అనే నావల్ యూనిట్ దక్కించుకుంది. ఇదే సమయంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో యుద్ధ నౌకలను డిమాండ్ పెరిగింది. దీంతో ఆ షిప్యార్డ్లో యుద్ధ నౌకలను తయారు చేయాలని తైసన్క్రూప్ నిర్ణయించుకుంది. అందుకు తగ్గట్టుగా షిప్ యార్డ్లో మార్పులు చేయాలని భావిస్తోంది. కానీ ఈ మరమ్మతు పనులకు గ్లోబల్ డ్రీమ్ 1, గ్లోబల్ డ్రీమ్ 2 క్రూయిజ్ షిప్లు అడ్డుగా ఉన్నాయి. దీంతో ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు ఈ షిప్లను ఖాళీ చేసేందుకు తైసన్క్రూప్ సంస్థ 2023 వరకు గడువు ఇచ్చింది.
గడువు లోపు గ్లోబల్ డ్రీమ్-2 షిప్ను ఎవరికైనా అమ్మేయాలని వెర్ఫ్టెన్ సంస్థ నిర్ణయించుకుంది. కానీ కరోనా తర్వాత భారీ క్రూయిజ్లకు డిమాండ్ తగ్గిపోవడంతో.. దాన్ని కొనుగోలు చేసేందుకు ఏ కంపెనీ ముందుకు రాలేదు. గడువు పూర్తయ్యే సమయానికి కూడా పరిస్థితి ఇలాగే ఉంటే గ్లోబల్ డ్రీమ్ 2 నౌకను తునాతునకలు చేసి తుక్కుగా అయినా సరే అమ్మేయాలని వెర్ఫ్టెన్ సంస్థ నిర్ణయించింది. ఒకవేళ అదే జరిగితే ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ నౌక.. తొలి ప్రయాణం చేయకముందే కనుమరుగైపోతుంది.
గ్రామాలకు డిజిటల్ దారి చూపిస్తున్న బాటసారి.. ఇప్పటికే 10వేల గ్రామాలు చుట్టొచ్చాడు!