95 ఏళ్ల ఆ బామ్మకు తెలియదు ప్రభుత్వం నుంచి తనకు పెన్షన్ వస్తుందని. ఆకలి తీరక కనిపించిన వాళ్ల ముందు చెయ్యిజాచాల్సిన పరిస్థితి. ఇది చూసిన ఒక మహిళ.. ఆ బామ్మ పక్కన కూర్చొని మాట్లాడింది. తన కథ చెప్పుకోవడానికి ఒకరు దొరకడంతో ఆ వృద్ధురాలు వణుకుతున్న కంఠంతో, కన్నీళ్లు పెట్టుకుంటూ తన గోడు వెళ్లబోసుకుంది.
పెన్షన్ ఎందుకు తీసుకోవడం లేదు? అని అడిగితే తెల్లబోయింది. తనకు ప్రభుత్వం డబ్బులు ఇవ్వడమేంటని ఎదురు ప్రశ్నించింది. తనకు ఎలాంటి సహాయం అందడం లేదనుకొంటూ రాజస్థాన్ ఎండల్లో మిట్టమధ్యాహ్నం పూట కాళ్లకు చెప్పులు కూడా లేకుండా బతుకుపోరాటం చేస్తున్న ఆ వృద్ధురాలికి రావాల్సిన పెన్షన్ ఏమైందో తెలుసుకోవడానికి ఆ మహిళ కంకణం కట్టుకుంది. తీరా చూస్తే పోస్టాఫీసులోని ఒక ఉద్యోగి.. వృద్ధురాలి సంతకం ఫోర్జరీ చేసి ఆ డబ్బులు నొక్కేస్తున్నాడని తేలింది. ఈ విషయం తెలియడంతో వృద్ధురాలికి అప్పటి వరకు రావలసిన పెన్షన్ అంతా ఒకేసారి అందించారు అధికారులు. ఇక తను ఎండా వాన అని లేకుండా భిక్షాటన చేయాల్సిన అవసరం లేదని తెలుసుకున్న ఆ బామ్మ.. తనకు సాయం చేసిన మహిళకు దండం పెట్టింది.
ఈ ఒక్క బామ్మే కాదు. దేశవ్యాప్తంగా ఎందరికో.. గట్టిగా చెప్తే ఎన్నో గ్రామాలకు దారి చూపింది ఒకే ఒక సంస్థ. అదే డీఈఎఫ్ (డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్). ప్రస్తుతం దీనిలో చాలా మంది సభ్యులు చేరారు కానీ.. అసలు ఈ ఆలోచన వెనక ఉంది ఒకే ఒక్కడు. అతనే ఒసామా మంజర్. బిహార్లో పుట్టిన మంజర్ దేశ రాజధానిలో పెరిగాడు. అక్కడ చాలా కష్టాలు పడ్డాడు. ఆ సమయంలోనే డీఈఎఫ్ ఆలోచన వచ్చింది. 20 ఏళ్ల క్రితం మొదలైన ఈ సంస్థ ఇప్పుడు ఎందరికో జీవనాధారంగా మారటమే కాకుండా.. ఎందరి జీవితాల్లోనో వెలుగులు నిపుతోంది.
ప్రస్తుతం డీఈఎఫ్ కింద దేశవ్యాప్తంగా సుమారు 2వేల ఇన్ఫర్మేషన్ రిసోర్స్ సెంటర్లు ఉన్నాయి. వీటిలో పనిచేసే వారిలో అత్యధికులు మహిళలే కావడం గమనార్హం. ఇలా డీఈఎఫ్లో చేరిన కొందరు డాక్టర్లు ఉచితంగా ఆన్లైన్లో వైద్య సలహాలు అందిస్తుంటే.. మరికొందరేమో గ్రామాలకు గ్రామాలు తిరుగుతూ అక్కడి ప్రజలకు ఇంటర్నెట్, దాని ఉపయోగాలు చెప్తూ వాళ్లను మోడర్న్ ప్రపంచానికి దగ్గర చేస్తున్నారు. గతేడాది కరోనా కారణంగా దేశంలో దాదాపు అన్ని వ్యవస్థలు ఆన్లైన్ విధానాన్ని ఎంచుకున్నాయి.
ఇలాంటి సమయంలో ఆన్లైన్లో తరగతులు వినడానికి కొందరు విద్యార్థులు సిగ్నల్ కోసం చెట్లు ఎక్కి కూర్చున్నారు. కొన్ని చోట్ల టీచర్లు కూడా చెట్లనే నమ్ముకోవాల్సి వచ్చింది. ఇవన్నీ చూసిన నెటిజన్లు వీరి కథలు స్ఫూర్తిమంతం అంటూ కామెంట్లు చేశారు. కానీ ఒసామా మంజర్కు నచ్చలేదు. ఆ పరిస్థితులు అతనికి కన్నీళ్లు తెప్పించాయి. మనదేశం ఇంకా ఇంత వెనకబడి ఉందా? అని ఏడవాల్సిన ఘటనలవి, వాటిని స్ఫూర్తిగా తీసుకోవడం ఏంటి? అని ఎదురు ప్రశ్నించాడు. తన డీఈఎఫ్ ద్వారా ఈ పరిస్థితిని మార్చాలని నిర్ణయించుకున్నాడు. తన సేవను మరింత విస్తారంగా, వేగంగా అందించేందుకు మరింత కృషి చేస్తున్నాడు. సుమారు 20 ఏళ్ల క్రితం తన ఇంటి బెడ్రూంలో కూర్చొని చేతిలో పైసా లేకపోయినా ఏదో చేయాలనే తపనతో డీఈఎఫ్ను స్థాపించాడతను.
ఏ ప్రాంతం గురించి మనకు తెలియాలన్నా.. అక్కడ ఎవరూ పెద్దగా పట్టించుకోని చోట మనుషులు ఎలా బతుకుతున్నారో చూడాలంటాడు మంజర్. ప్రస్తుత కాలంలో ఇంటర్నెట్ను ఒక ఆయుధంలా వాడుకుంటున్నారు. కానీ తను మాత్రం దాన్ని అందరికీ చేరువచేసి, ఇంటర్నెట్ ఉపయోగాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం కృషి చేస్తున్నాడు మంజర్. బాలికలకు స్టెమ్ విద్య, దివ్యాంగులకు ప్రత్యేక కార్యక్రమాలు వంటి 30పైగా ప్రాజెక్టులతో ఒక మొబైల్ యాప్ రూపొందించాడు మంజర్.
దారిద్య్రరేఖకు దిగువను ఉండే వారికి ఉన్నత విద్యనందించడం కోసమే ఈ ప్రోగ్రాంలు సిద్ధం చేశారు. తమకు లభించే గ్రాంట్లు, కార్పొరేట్ కంపెనీలు సామాజిక సేవ కోసం చేసే దానాల మీదనే ఈ యాప్ నిర్వహణ జరుగుతోంది. చిన్నప్పటి నుంచి గ్రామాలకు వెళ్లడమంటే తనకు చాలా ఇష్టమని, అక్కడ ఉండే జ్ఞానం చాలా ఆసక్తికరంగా ఉంటుందని మంజర్ అంటాడు. స్కూల్, కాలేజీల కన్నా పల్లెటూళ్లలోనే ఎక్కువ విషయాలు తెలుసుకోవచ్చని బలంగా వాదిస్తాడు. అందుకే తన డీఈఎఫ్ ద్వారా వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు కష్టపడుతుంటాడు.
చేనేతపై మమకారం..
దేశం అభివృద్ధిలో ముందుకు పోతోందని అందరూ అంటారు. కానీ ఎక్కడకు వెళ్లినా చేనేత కార్మికుల కష్టాలకు కొదవ ఉండదు. చీకటిపడిన తర్వాత నోట్లోకి అన్నం ముద్ద వెళ్లడమే గగనం అవుతుంది. అలాంటి కష్టాలు తెలుసుకొన్న మంజర్.. మధ్యప్రదేశ్లోని చందేరీ నేతకార్మికులకు అండగా నిలబడి, వారి కోసం ప్రత్యేకంగా ‘చందేరియాన్’ అనే డిజిటల్ మార్కెట్ వెబ్సైట్ సృష్టించాడు. మంజర్ చెప్పిన విషయాలు నేర్చుకున్న అక్కడి నేత కార్మికులు కంప్యూటర్లో సొంతగా కొన్ని డిజైన్లు చేశారు.
వాటిలో ఒకటి ఏకంగా 2010 కామన్వెల్త్ క్రీడలకు కూడా ఎంపికవడం విశేషం. ప్రపంచంలోనే అత్యంత నాణ్యమైన కాటన్ మన దగ్గర దొరుకుతుందని, కానీ ప్రపంచ మార్కెట్ను ఎలా చేరుకోవాలో తెలియక దాన్ని అమ్మలేకపోతున్నామని మంజర్ భావన. ఇలా ఇంటర్నెట్ను సరిగా ఉపయోగించుకోవడం మనకు తెలియదు కాబట్టే ప్రపంచం మొత్తం మనల్ని ఉత్పత్తిదారులుగా కాకుండా వినియోగదారులుగా మాత్రమే చూస్తోందని వివరించాడు. తను కూడా చేనేత కార్మికులకు మద్దతునివ్వడం కోసం ఆ దుస్తులే ధరిస్తాడు.
పెద్దలను ఎదిరించి పెళ్లి..
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో చదువుకునే షెఫాలీ చికర్మానే అనే అమ్మాయితో మంజర్ ప్రేమలో పడ్డాడు. అతని వద్ద ఏమీ లేని సమయంలో, అన్నం తినడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న టైంలో.. షెఫాలీ అతని కోసం ఆహారం తీసుకొచ్చేది. ఇలా వాళ్లిద్దరి పరిచయం ప్రేమగా మారింది. కానీ వాళ్ల పెళ్లికి పెద్దలు అంగీకరించలేదు. వాళ్లను ఎదిరించి ఇద్దరూ సింపుల్గా పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత కరోనా కాలంలో ఢిల్లీలో ఉండలేక పుదుచ్చేరి వచ్చేశాడు. తనకు మైగ్రేన్ ఉండటంతో ఒకసారి టెడ్ఎక్స్ షో సమయంలో బాగా తలనొప్పి వచ్చిందని, ఆ సమయంలో ఒక వ్యక్తి వచ్చి తన తలపై ఒక వస్త్రం కట్టడంతో అది కంట్రోల్ అయిందని చెప్పిన మంజర్.. అప్పటి నుంచి దాన్ని వదల్లేదు. ఇప్పటికీ ఇంటి దగ్గర తన భార్య వేసుకునే ఏదో ఒక దుపట్టాను తీసుకొని తలగుడ్డలా కట్టుకునే తిరుగుతుంటాడు.
నేషనల్ పాలసీల్లోనూ అతని ఆలోచనలు..
అంతకుముందు కొన్నాళ్లపాటు జర్నలిజం, ఎయిర్ఫోర్సులో కూడా పనిచేసిన మంజర్.. ఆ తర్వాత తను ఏం చెయ్యాలో స్పష్టత రావడంతో అవన్నీ వదిలేసి ఈ డీఈఎఫ్ ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో ఎన్నో కొత్త కొత్త ఐడియాలతో, వాటికి ఇంటర్నెట్ను జోడించి ఎందరి జీవితాలనో మార్చేశాడు. అతని ఐడియాల్లో కొన్ని జాతీయ స్థాయి పాలసీలుగా కూడా రూపాంతరం చెందాయంటే అవి ఎంత ప్రభావవంతంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తన ఆలోచనలన్నీ గ్రామాల్లోనే పుట్టాయని, చిన్న తనంలో ఎండాకాలం సెలవలకు గ్రామాలకు వెళ్లడం నుంచి ఇప్పటి వరకు 10 వేలపైగా గ్రామాలు చుట్టొచ్చానని అంటాడు మంజర్. గ్రామాల్లో ఉన్న జ్ఞానం వల్లనే తను ఇంతదూరం వచ్చానంటూ నవ్వుతూ చెప్తాడు.