రష్యా ప్రభుత్వ టెలివిజన్ సంచలన ప్రకటన
‘మాస్కువా’ యుద్ధనౌక ఘటన ప్రస్తావన
కీవ్పై తిరిగి దాడులు ప్రారంభించిన రష్యా
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్పై నిషేధం
రష్యా ఆయిల్ను నిషేధించాలి: జెలెన్స్కీ
మాస్కో, ఏప్రిల్ 16: ఉక్రెయిన్, రష్యా మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో రష్యా ప్రభుత్వ అధికారిక టెలివిజన్ ‘రష్యా-1’ సంచలన వ్యాఖ్యలు చేసింది. రష్యాకి చెందిన యుద్ధ నౌక మాస్కువా నల్లసముద్రంలో మునిగిపోవడంతో మూడో ప్రపంచ యుద్ధం మొదలైందని వ్యాఖ్యానించింది. అగ్ని ప్రమాదం కారణంగా నౌక మునిగిపోయిందని రష్యా చెబుతుండగా, నెప్ట్యూన్ క్షిపణి ద్వారా దాన్ని ధ్వంసం చేశామని ఉక్రెయిన్ ప్రకటించింది. దీనిపై జరిగిన ఓ డిబేట్ సందర్భంగా రష్యా-1 చానెల్ యాంకర్ ఓల్గా స్కబయేవా ‘ఏదైతే జరిగిందో దాన్ని మూడో ప్రపంచ యుద్ధంగా పిలవొచ్చు. ఇది కచ్చితంగా జరుగుతుంది’ అని ప్రకటన చేశారు. నాటోతో ప్రత్యక్షంగా కానున్నా, రష్యా ప్రస్తుతం నాటో ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పోరాడుతున్నట్టే భావించాలని, దీన్ని మనం గుర్తించాల్సి ఉన్నదని వీక్షకులను ఉద్దేశించి ఆవేశంగా అన్నారు. చర్చల్లో పాల్గొన్న ఓ వ్యక్తి మాట్లాడుతూ మాస్కువా నౌక మునక రష్యా గడ్డపై జరిగిన దాడిగా పోల్చారు. ఈ చర్చకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కీవ్కు పౌరులు రావొద్దు
కీవ్తో పాటు పశ్చిమ ఉక్రెయిన్ ప్రాంతాలపై రష్యా తన దాడులను తిరిగి ప్రారంభించింది. కీవ్కు తూర్పున ఉండే డార్నిట్సీ జిల్లాలో బాంబు దాడులు జరిగాయని మేయర్ విటలి క్లిట్షో పేర్కొన్నారు. కీవ్లోని సాయుధ వాహనాల ప్లాంట్ లక్ష్యంగా దాడి చేశామని రష్యా మంత్రిత్వ శాఖ అధికారి ప్రతినిధి పేర్కొన్నారు. రష్యా తిరిగి దాడులు ప్రారంభించిన నేపథ్యంలో నగరాన్ని వీడివెళ్లిన పౌరులు ప్రస్తుతానికి రావొద్దని సూచించారు. కిరోవోహ్రాద్ రీజియన్లోని ఒలెక్సాండ్రియాలో ఎయిర్ఫీల్డ్పై క్షిపణి దాడి జరిగింది. కీలకమైన పోర్టు సిటీ మరియుపోల్ కోసం పోరాటం కొనసాగుతున్నదని ఉక్రెయిన్ రక్షణశాఖ అధికార ప్రతినిధి ఒలెగ్జాండర్ పేర్కొన్నారు. మరోవైపు కీవ్ శివారు ప్రాంతాల్లో 900 మంది పౌరుల మృతదేహాలను గుర్తించినట్టు అధికారులు పేర్కొన్నారు. చాలా మందిని తుపాకులతో కాల్చారని పోలీసులు తెలిపారు.
రష్యా రివర్స్ ఆంక్షలు
ఉక్రెయిన్పై యుద్ధం నేపథ్యంలో పలు ఆంక్షలు విధించిన బ్రిటన్పై రష్యా ప్రతిచర్యలు చేపట్టింది. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్తో పాటు పలువురు మంత్రులు, టాప్ రాజకీయ నేతలను తమ దేశంలోకి రాకుండా నిషేధించినట్టు రష్యా విదేశాంగ మంత్రి ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ జాబితాలో భారత సంతతికి చెందిన రిషి సునక్, ప్రీతి పటేల్ కూడా ఉన్నారు.
3 వేల మంది సైనికులను కోల్పోయాం
రష్యాతో పోరాటంలో ఇప్పటి వరకు 3 వేల మంది వరకు సైనికులను కోల్పోయామని, 10 వేల మందికి గాయాలయ్యాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు. కచ్చితమైన సమాచారం లేనందున ఎందరు పౌరులు మరణించారో చెప్పడం కష్టమన్నా రు. రష్యాను నిలువరించేందుకు ప్రస్తుతం విధించిన ఆంక్షలు సరిపోవని, శాంతి నెలకొనాలంటే రష్యా ఆయిల్పై నిషేధం విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రష్యా ఆయిల్ను ‘ప్రజాస్వామ్య ప్రపంచం’ బ్యాన్ చేయాలని పిలుపునిచ్చారు.