Paracetamol | లండన్, డిసెంబర్ 28: అనారోగ్యంతో దవాఖానకు వచ్చిన ఓ 30 మహిళ పారాసిటమాల్ ఓవర్డోస్ అవ్వటం వల్ల మరణించింది. బ్రిటన్లోని విడ్నెస్ పట్టణంలో 19 ఏప్రిల్ 2017న చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. మృతి చెందిన లారా హిగ్గిసన్(30)కు ఇద్దరు పిల్లలు, భర్త ఉన్నారు. ‘న్యుమోనియా’బారిన పడ్డ ఆమె చికిత్స కోసం 5 ఏప్రిల్ 2017న దవాఖానలో చేరింది.
ప్రతిరోజూ పారాసిటమాల్ డోస్ను పెంచుతూ ఆమెకు చేసిన చికిత్స వికటించిన సంగతి వైద్యులు ఆలస్యంగా గుర్తించారు. దీనికి విరుగుడుగా యాంటీ డోస్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాధిత మహిళ శరీరంలోని కీలక అవయాలు దెబ్బతిని మరణానికి దారి తీసిందని వైద్య వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై వైద్య అధికారులు దర్యాప్తు చేపట్టారు. లారా హిగ్గిసన్ 5 అడుగుల ఎత్తు, 40 కిలోల బరువు మాత్రమే ఉన్నారని, ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ‘పారసిటమాల్’ అధిక మొత్తంలో ఇవ్వటం..మరణానికి దారి తీసిందని వైద్య నిపుణులు భావిస్తున్నారు.