ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా, ఎడారి దేశం సౌదీ అరేబియా మధ్య సంబంధాలు అంత బాగలేవు. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాపై అమెరికా సహా పలు పాశ్యాత్య దేశాలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయిల్, నేచురల్ గ్యాస్ కోసం ప్రత్యామ్నాయంపై ఆధారపడాలని అమెరికా భావించింది. దీనిలో భాగంగా సౌదీలో ఆయిల్ ఉత్పత్తి పెంచాలని కోరింది.
అయితే ఈ ప్రతిపాదనను సౌదీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా తిరస్కరించింది. ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను బట్టి చమురు ఉత్పత్తిని పెంచే ఉద్దేశ్యమే లేదని తేల్చి చెప్పింది. ఇలాంటి పరిస్థితుల మధ్య త్వరలో జీ20 శిఖరాగ్ర సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఈ రెండు దేశాల నేతలు వస్తున్నారు. మరి ఈ సందర్భంలో సౌదీ యువరాజును బైడెన్ కలుస్తారా? చమురు ఉత్పత్తిపై మాట్లాడతారా? అనే చర్చ జోరందుకున్నది.
దీనికి అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సుల్లీవన్ సమాధానం ఇచ్చారు. ఆదివారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. జీ20 సమావేశంలో భాగంగా సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ను కలిసే ఆలోచన బైడెన్కు లేదని తేల్చి చెప్పారు. ‘జీ20 శిఖరాగ్ర సమావేశంలో సౌదీ యువరాజును కలవాలనే ఆలోచన ప్రెసిడెంట్ బైడెన్కు ఏమాత్రం లేదు’ అని స్పష్టంగా ప్రకటించారు.