కోపెన్హాగెన్ : ఆగస్ట్ నాటికి డెల్టా వేరియంట్ విజృంభిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) యూరప్ను హెచ్చరించింది. గత వారం యూరప్లో కేసుల సంఖ్య పదిశాతం పెరగడం డెల్టా ఉధృతికి సంకేతమని స్పష్టం చేసింది. ఆందోళనకర వేరియంట్గా గుర్తించినా డెల్టా స్ట్రెయిన్ సభ్య దేశాలు ఎన్ని చర్యలు చేపట్టినా వ్యాప్తి చెందుతోందని, ఇంకా లక్షలాది మందికి వ్యాక్సినేషన్ పూర్తికాని నేపథ్యంలో అప్రమ్తతంగా ఉండాలని డబ్ల్యహెచ్ఓ యూరప్ ప్రాంతీయ డైరెక్టర్ హాన్స్ క్లగ్ హెచ్చరించారు. బహుళవ్యాప్తితో డెల్టా వేరియంట్ అల్ఫా స్ట్రెయిన్ను వేగంగా అధిగమిస్తోందని, దీంతో ఎక్కువ మంది దవాఖానల్లో చేరాల్సి రావడం, మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకరమని అన్నారు.
ఆగస్ట్ నాటికి యూరప్లో డెల్టా ప్రబలంగా వ్యాప్తి చెందుతుందని క్లగ్ అంచనా వేశారు. నూతన వేరియంట్లు, వ్యాక్సినేషన్ పూర్తి కాకపోవడం, ప్రజలు గుంపులుగా ఒకచోట చేరడం వంటి కారణాలతో రాబోయే రోజుల్లో నూతన వైరస్ వేవ్లు ముంచెత్తుతాయని క్లగ్ ఆందోళన వ్యక్తం చేశారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ వ్యాక్సిన్ రెండు డోసులూ తీసుకుని వైరస్ నుంచి రక్షణ పొందాలని ఆయన యూరోపియన్లను కోరారు. వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంటేనే డెల్టా వేరియంట్ నుంచి రక్షణ లభిస్తుందని అన్నారు. వ్యాక్సినేషన్లో జాప్యాలు ప్రజల ప్రాణాలతో పాటు ఆర్థిక వ్యవస్ధలూ ధ్వంసమవుతాయని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ మందకొడిగా సాగితే మరిన్ని వేరియంట్లు ప్రబలుతాయని అన్నారు.