న్యూఢిల్లీ : ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో కరోనా కేసులు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. చైనా, బ్రిటన్తో సహా చాలా దేశాల్లో గతంలో కంటే రోజువారీ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో లాక్డౌన్ విధించిన పరిస్థితులున్నాయి. భారత్లో ఇటీవల కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఢిల్లీ – ఎన్సీఆర్లో పాఠశాలలో కేసులు నమోదవుతున్నాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. కొత్త వేరియంట్లను నివారించేందుకు ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న కొవిడ్ కేసుల మధ్య ప్రపంచ ఆరోగ్య సంస్థ నిపుణుల వాదనలు ఆందోళనలు పెంచుతున్నాయి. ఇటీవల ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ నివేదికను విడుదల చేసింది.
మహమ్మారి ఇంకా ఉందని, దాన్ని ఏ స్థాయిలోనైనా తేలిగ్గా తీసుకొని తప్పు చేయొద్దని హెచ్చరించింది. చిన్న చిన్న అజాగ్రత్తలు పరిస్థితిని మరింత దిగజారుస్తాయని చెప్పింది. అన్ని దేశాలు టీకాల పంపిణీపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించాయి. కరోనా థర్డ్ వేవ్ అనంతరం ఎపిడెమియాలజిస్టులు అనేక నివేదికల్లో వైరస్ స్థానిక దశకు చేరుకుందని, దీంతో ప్రజలకు ఎక్కువగా ప్రమాదం ఉండదని పేర్కొన్నారు. అయితే, ఈ వాదనలను ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖండిస్తున్నది. డబ్ల్యూహెచ్ఓ హెల్త్ ఎమర్జెన్సీ ప్రోగ్రామ్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ ఇటీవల అత్యవసర సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా స్థానిక దశకు చేరిందని భావించడం తప్పన్నారు. ఇది ఇప్పటికీ పెను ముప్పు పొంచి ఉందన్నారు.
దక్షిణాఫ్రికాలో గతేడాది నవంబర్లో గుర్తించిన ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించిన విషయం తెలిసిందే. మూడో దశలో ఒమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపింది. ఒమిక్రాన్ వేరియంట్ నుంచి కొత్త వేరియంట్ పుట్టుకువచ్చిందే ఎక్స్ఈ వేరియంట్. ఇప్పటికీ పలు దేశాల్లో ఈ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. గడిచిన నెలలో ప్రపంచవ్యాప్తంగా కేసులు పెరుగుతున్న తీరును చూస్తే ఖచ్చితంగా సవాల్తో కూడుకున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతానికి కొవిడ్-19ను స్థానిక దశగా పరిగణించి తప్పు చేయొద్దని స్పష్టం చేస్తున్నది. వైరస్తో ఇప్పటికీ ముప్పు ఉంటుందని, ప్రత్యేకించి ప్రత్యేకంగా అప్రమత్తత అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొత్త వేరియంట్లు సాపేక్షంగా మరింత ఇన్ఫెక్షన్ కలిగిస్తాయని, వాటిని నిరోధించడానికి మరింత అప్రమత్తత అవసరమని స్పష్టం చేస్తున్నారు.
గత నెల రోజులుగా దేశంలో కరోనా కేసులు రోజురోజుకు తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 11వేల వరకు యాక్టివ్ కేసులున్నాయి. అయితే, ఇటీవల స్వల్పంగా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఆందోళన కలిగిస్తున్నది. ఢిల్లీ ప్రభుత్వం కొవిడ్-19పై ఏర్పాటు చేసిన సాంకేతిక సలహా కమిటీ (TAC) నిపుణులు స్థానిక స్థాయిలో కొవిడ్ కేసుల పరీక్ష, పర్యవేక్షణను పెంచడంపై నొక్కి చెప్పింది. అయితే, దీన్ని ఫోర్త్ వేవ్కు సంకేతంగా పరిగణించడం చాలా తొందరవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, రాబోయే రోజుల్లో మళ్లీ ఇన్ఫెక్షన్కు గురయ్యే ప్రమాదం ఉంటుందని చెబుతున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నారా? లేదా ? అన్నదానితో సంబంధం లేకుండా మహమ్మారికి వ్యతిరేకంగా జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని చెబుతున్నారు.