సనా: పశ్చిమ ఆసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. యెమన్లోని ఇరాన్ మద్దతు కలిగిన హౌతీ రెబల్స్ తాజాగా సౌదీ అరేబియాపై సముద్ర దిగ్బంధనాన్ని ప్రకటించారు. ఇటీవల ఇరు వర్గాల మధ్య చాలా ఏళ్ల తర్వాత కాల్పులు జరిగిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది.
‘క్రిమినల్ అయిన సౌదీ శత్రువుపై సముద్ర దిగ్బంధనాన్ని ప్రకటిస్తున్నాం. ఇది తక్షణం అమల్లోకి వస్తుంది’ అని హౌతీ ప్రతినిధి యహ్వా సారీ తెలిపారు. సౌదీ అరేబియాపై హౌతీలు అధికారికంగా దిగ్బంధనం ప్రకటించడంతో ఎర్ర సముద్రం గుండా సాగే నౌకా రవాణా మార్గానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.