Basmati Rice : ఇరాన్ (Iran) పై ఇజ్రాయెల్ (Israel), అమెరికా (US) చేస్తున్న యుద్ధం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తీవ్రంగా పెంచింది. ఈ యుద్ధం పశ్చిమాసియా దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. భారత బాస్మతీ రైతుల (Basmati Farmers) పై కూడా ఈ యుద్ధం ప్రభావం పడింది. ఏటా దేశానికి భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టే సుమారు రూ.50 వేల కోట్ల విలువైన బాస్మతి పరిశ్రమ.. ఇప్పుడు తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది. యుద్ధం కారణంగా పశ్చిమాసియాకు వెళ్లే సముద్ర మార్గాలు అత్యంత ప్రమాదకరంగా మారాయి.
ఈ క్రమంలో ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దాంతో సుమారు 10 లక్షల టన్నుల బాస్మతీ బియ్యం భారత ఓడరేవుల్లోనే పేరుకుపోయింది. దీనికి తోడు, షిప్పింగ్ కంపెనీలు ‘వార్-రిస్క్ సర్ ఛార్జ్’ పేరుతో అదనపు ఛార్జీలు వసూలు చేస్తుండటంతో రవాణా ఖర్చులు రెట్టింపయ్యాయి. ఇది బాస్మతి బియ్యం ఎగుమతిదారులకు పెను భారంగా మారింది. మరోవైపు ఇప్పటికే ఎగుమతి చేసిన సరుకులకు సంబంధించి చెల్లింపులు కూడా ఆగిపోయాయి. ఇరాన్ వంటి దేశాల నుంచి రావాల్సి ఉన్న రూ.2,000 కోట్ల నుంచి రూ.25,000 కోట్ల వరకు బకాయిలు నిలిచిపోయినట్లు తెలుస్తోంది.
అక్కడి బ్యాంకింగ్ వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని సమాచారం. ఈ పరిణామాల ప్రభావంతో దేశీయ మార్కెట్లలో బాస్మతీ ధర క్వింటాల్కు రూ.800 వరకు పడిపోయింది. ఇది పంజాబ్, హర్యానా, మధ్యప్రదేశ్, జమ్ముకాశ్మీర్ రైతులను ఆర్థికంగా దెబ్బతీస్తున్నది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే మొత్తం బాస్మతీలో 70 నుంచి 75 శాతం సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, యూఏఈ లాంటి దేశాలకే వెళ్తుంది. ఈ అనిశ్చితి ఇలాగే కొనసాగితే.. భారత మార్కెట్ను పాకిస్థాన్ వంటి పోటీ దేశాలు కైవసం చేసుకునే ప్రమాదం ఉందని ఎగుమతిదారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.