కాబూల్: తాలిబన్లు( Taliban ) మరోసారి మాట మార్చారు. ఆఫ్ఘనిస్థాన్ను మళ్లీ చేతుల్లోకి తీసుకున్న తర్వాత చెప్పిన మాటలకు, ఇప్పుడు చేస్తున్న పనులకు పొంతన లేకుండా ఉంది. తాజాగా కశ్మీర్ విషయంలోనూ తాలిబన్లు మాట మార్చారు. వచ్చిన కొత్తలో కశ్మీర్ అంతర్గత విషయమని, అది ఇండియా, పాకిస్థాన్ ద్వైపాక్షిక అంశమన్న వాళ్లు.. ఇప్పుడు కశ్మీర్ ముస్లింల గురించి మాట్లాడే హక్కు తమకుందని అనడం గమనార్హం. బీబీసీ ఉర్దూతో మాట్లాడిన తాలిబన్ అధికార ప్రతినిధి సుహైల్ షహీన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ హక్కు మాకుంది. ముస్లింలుగా కశ్మీర్, ఇండియా సహా ఏ దేశంలోని ముస్లింల కోసమైనా గళమెత్తే హక్కు మాకు ఉంది అని షహీన్ అన్నాడు.
అయితే ఏ దేశంపైనా తాము ఆయుధాలు ఎక్కుపెట్టబోమని కూడా అతను స్పష్టం చేశాడు. ముస్లింలు మీ సొంత మనుషులు, మీ దేశ పౌరులు. మీ చట్టాల ప్రకారం వాళ్లకు కూడా సమాన హక్కులు ఉండాలని మేము గళమెత్తుతాం అని షహీన్ చెప్పాడు. ఆఫ్ఘన్ భూభాగం ఇండియా వ్యతిరేక ఉగ్రవాద శక్తుల అడ్డాగా మారకూడదని ఈ మధ్య తాలిబన్లతో చర్చల సందర్భంగా భారత ప్రభుత్వం తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. ఖతార్లో ఇండియా రాయబారి దీపిక్ మిట్టల్ తాలిబన్ నేత షేర్ మహ్మద్ను కలిసి ఈ విషయాన్ని చెప్పారు. ఈ నేపథ్యంలో వాళ్ల నుంచి కశ్మీర్పై ఇలాంటి ప్రకటన రావడం గమనార్హం.