కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్ శివారు ప్రాంతాలపై రష్యా బలగాలు ఏకధాటిగా ఫైరింగ్ చేస్తూనే ఉన్నాయి. జనావాసాలపై రాకెట్ దాడులు కొనసాగుతూనే ఉన్నట్లు తెలుస్తోంది. శివారు ప్రాంతం బుచాలో పిస్తోళ్ల మోత నిర్విరామంగా కొనసాగుతోంది. దాడి ఎంత భీకరంగా జరుగుతుందంటే, కనీసం వీధుల్లో పడి ఉన్న మృతదేహాలను తీసుకురావడం కూడా కష్టంగా మారినట్లు మేయర్ అనటోల్ ఫెడోరక్ తెలిపారు. పగలూ, రాత్రీ భారీ ఆయుధాలతో కాల్పులు మోత కొనసాగుతోందని, దాని వల్లే వీధుల్లో పడి ఉన్న మృతదేహాలను సేకరించడం కష్టంగా మారినట్లు ఆయన చెప్పారు. వీధుల్లో పడి ఉన్న మృతదేహాలను కుక్కలు పీక్కు తింటున్నాయని, ఇదో పీడకలగా మారినట్లు ఆయన అన్నారు. చాలా రోజుల నుంచి తమ సబర్బన్ ప్రాంతంపై దాడి జరుగుతున్నట్లు ఆయన చెప్పారు.