వాషింగ్టన్: ట్రుత్ సోషల్ వేదికగా డోనాల్ట్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. పశ్చిమాసియాలో చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ ద్వారా తమ లక్ష్యాలకు చేరువైనట్లు ఆయన వెల్లడించారు. ఇరాన్పై చేపట్టిన సైనిక చర్య గురించి ట్రంప్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపారు. ఇరాన్కు చెందిన క్షిపణి సామర్థ్యం, లాంచర్లు, ఇతర ఆయుధాలను పూర్తిగా ధ్వంసం చేసినట్లు చెప్పారు. ఇరాన్ ఇండస్ట్రియల్ బేస్ను కూడా ధ్వంసం చేసినట్లు తెలిపారు. ఆ దేశ నేవీ, ఎయిర్ ఫోర్స్ను కూడా దెబ్బతీశామన్నారు. యాంటీ ఎయిర్క్రాఫ్ట్ ఆయుధాలను కూడా ధ్వంసం చేశామన్నారు. ఇరాన్ అణ్వాయుధాలు తయారు చేసే సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీశామన్నారు.
పశ్చిమాసియాలోని తమ మిత్రదేశాలను రక్షించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, ఖతార్, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ ఇతర దేశాల రక్షణకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చెప్పారు. కీలకమైన హోర్ముజ్ జలసంధికి రక్షణ ఏర్పాటు చేయాలని, ఆ జలసంధిని వినియోగించే దేశాలు దానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒకవేళ ఎవరికైనా ఈ అంశంలో సహాయం అవసరమైతే తాము ఆ దేశాలను ఆదుకోనున్నట్లు చెప్పారు.
తాము చేపట్టిన మిలిటరీ ఆపరేషన్ పట్ల శ్రద్ద చూపిన వారికి థ్యాంక్స్ చెబుతున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై దాడి చేసిన అమెరికా తన మిలిటరీ ఆపరేషన్ను నిలిపివేయాలనుకుంటున్నట్లు చెప్పారు.