భారత్, యూకే మధ్య ఫ్రీ ట్రేడ్ డీల్ (ఎఫ్టీఏ) మరింత ఆలస్యం అయిన సంగతి తెలిసిందే. దీపావళి నాటికి ఈ డీల్ పూర్తిచేయాలని ఇరు దేశాల అధికారులు భావించారు. అయితే ఈ ఒప్పందం మరింత ఆలస్యం అవుతోంది. దీనిపై బ్రిటన్ ట్రేడ్ పాలసీల విభాగం మంత్రి గ్రెడ్ హ్యాండ్స్ స్పందించారు.
ఇండియా, యూకే ఎఫ్టీఏ డీల్ డ్రాఫ్ట్ పూర్తి చేయడానికి దీపావళి డెడ్లైన్ను వదులుకున్న విషయాన్ని ఆయన చెప్పారు. ‘ఈ డీల్ ఎప్పుడు జరుగుతుంది? అనే దాని కన్నా ఒప్పందం సక్సెస్ఫుల్గా జరగడం ముఖ్యం. ఈ విషయంలో మెరుగైన ఫలితం కోసం చర్చలు కొనసాగుతున్నాయి’ అని గ్రెగ్ హ్యాండ్స్ చెప్పారు.
ఎఫ్టీఏ ఒప్పందంలో యూకే చీఫ్ నెగోషియేటర్ అయిన హర్జీందర్ కాంగ్ పిలవడంతో దీపావళి రిసెప్షన్లో గ్రెగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఎఫ్టీఏ ఆలస్యం అవడంపై స్పందించారు. భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్తో యూకే ట్రేడ్ సెక్రటరీ కెమి బాడెనోచ్ చర్చలు జరుపుతున్నారని, ఇరుదేశాల మధ్య మరింత సౌభ్రాతృత్వ సంబంధాలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని గ్రెగ్ చెప్పారు.