వాషింగ్టన్: ఇజ్రాయెల్ (Israel) సేనలకు, హమాస్ (Hamas) మిలిటెంట్లకు మధ్య పోరు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(Joe Biden) ఇజ్రాయెల్కు కీలక హెచ్చరిక చేశారు. హమాస్ను ఎదుర్కొనే విషయంలో ఆవేశం వద్దని, 9/11 దాడి అనంతరం అమెరికా చేసిన తప్పులనే ఇజ్రాయెల్ చేయవద్దని, ఆ తప్పుల నుంచి ఇజ్రాయెల్ గుణపాఠం నేర్చుకోవాలని బైడెన్ సూచించారు.
‘నేను ఇజ్రాయెల్లో పర్యటించిన సమయంలో 9/11 దుర్ఘటన వల్ల అమెరికా అనుభవించిన నరకాన్ని గుర్తుచేశాను. అప్పుడు తీవ్ర ఆగ్రహానికి గురైన విషయాన్ని తెలియజేశాను. అప్పుడు మేం న్యాయం కోసం ఆవేశంగా వెళ్లి తప్పులు చేశామని, అందుకే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆవేశంతో కళ్లు మూసుకుపోయి వ్యవహరించవద్దని, ఆలోచించి అడుగులు వేయాలని, ఇజ్రాయెల్ ప్రభుత్వానికి నేను సూచించా’ అని బైడెన్ పేర్కొన్నట్టు ఓ వార్తా సంస్థ వెల్లడించింది.
2001 సెప్టెంబర్ 11న అల్ఖైదా ఉగ్ర సంస్థ అమెరికాలోని ప్రభుత్వ, వాణిజ్య కేంద్రాలపై దాడులు చేసింది. ఆ దుర్ఘటనలో మూడు వేల మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడితోనే అమెరికా (USA) ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపడం మొదలు పెట్టింది. ఈ దాడులకు సూత్రధారి, అల్ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ను ఉత్తర పాకిస్థాన్లో ఉన్నట్లు గుర్తించిన అమెరికా.. 2011లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి అంతం చేసింది.
తమ దేశంలో ఉగ్రదాడి అనంతరం అఫ్గానిస్థాన్లో సైన్యాన్ని మోహరించిన అగ్రరాజ్యం.. అనేక మంది ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. ఆ క్రమంలో సుదీర్ఘకాలం అంటే సుమారు 20 ఏళ్లపాటు ఆ దేశంలో బలగాలను కొనసాగించాల్సి వచ్చింది. ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా గాజాలో ఇరుక్కుపోవద్దనే ఉద్దేశంతో ఈ హెచ్చరిక చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు గురువారం రాత్రి ఓవల్ ఆఫీస్ నుంచి బైడెన్ కీలక ప్రసంగం చేశారు. తమ దేశాలను కాపాడుకునేందుకు యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్, ఉక్రెయిన్లకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని చెప్పారు. హమాస్ మిలిటెంట్లు, రష్యా గవర్నమెంట్ వేర్వేరు విధాలుగా బెదిరింపులకు పాల్పడుతున్నప్పటికీ పొరుగున ఉన్న ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా నాశనం చేయడమే వారి లక్ష్యమని బైడెన్ విమర్శించారు.