న్యూయార్క్ : ఉక్రెయిన్పై రష్యా దమనకాండలో వ్లాదిమర్ పుతిన్ దూకుడుకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మద్దతు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని బెలారస్ను అమెరికా హెచ్చరించింది. ఉక్రెయిన్పై మాస్కో దాడుల నేపధ్యంలో పుతిన్కు లుకషెంకో మద్దతు కొనసాగిస్తే బెలారస్ తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుందని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్ ప్రైస్ స్పష్టం చేశారు.రష్యా, ఉక్రెయిన్ల మధ్య కాల్పుల విరమణ, రష్యా బలగాల ఉపసంహరణపై బెలారస్ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
ఉక్రెయిన్పై రష్యా తలపెట్టిన యుద్ధంలో త్వరలో బెలారస్ పాలుపంచుకుంటుందనే నివేదికల నేపధ్యంలో ఆ దేశానికి అమెరికా గట్టి హెచ్చరికలు పంపింది. మరోవైపు ఉక్రెయిన్ రాజధాని కీవ్ను రష్యా సేనలు చుట్టుముట్టాయి. పౌర ఆవాసాలపై దాడులు చేపడుతుండటంతో రాజధాని నగరం భయకంపితమవుతోంది. ఉక్రెయిన్ సంక్షోభం తీవ్రతరమవడంతో భారత్ అప్రమత్తమైంది. ఇక ఉక్రెయిన్లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే వేలాది మంది విద్యార్థులను ఇండియాకు తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు ఆపరేషన్ గంగాకు వాయుసేన కూడా జతకట్టింది.
ఉక్రెయిన్ నుంచి భారతీయులను ఖాళీచేయించే ప్రక్రియను వేగవంతం చేసేందుకు వాయుసేన కూడా ఈ కీలక ఆపరేషన్లో రంగంలోకి దిగాలని ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాలు జారీ చేశారు. అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ గంగా కోసం వాయుసేనకు చెందిన సీ-17 గ్లోబ్మాస్టర్ విమానాన్ని వాడనున్నారు. ఇవాళ ఉదయం ఉక్రెయిన్ అంశం గురించి రాష్ట్రపతి రామ్నాధ్ కోవింద్తో ప్రధాని మోదీ చర్చించారు.