ఉక్రెయిన్లో 60 మంది పౌరులు మృతి!
అజోవ్స్టల్ స్వాధీనానికి రష్యా యత్నాలు
జపోరిజ్జియా, మే 8: ఉక్రెయిన్కి చెందిన లుహాన్స్ ప్రాంతంలోని ఓ పాఠశాల షెల్టర్ భవనంపై రష్యా సేనలు బాంబుల దాడికి పాల్పడ్డాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 60 మంది వరకు మరణించినట్టు తెలుస్తున్నది. బాంబు దాడి సమయంలో భవనంలో దాదాపు 90 మంది ఉన్నారు. వీరిలో 30 మందిని రక్షించారు. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. శిథిలాల కింద మరో 60 మంది వరకు చిక్కుకొని ఉండొచ్చని, వీరంతా చనిపోయి ఉంటారని లుహాన్స్ రీజియన్ గవర్నర్ సెర్హీ హైడే పేర్కొన్నారు.
ప్రివిలియా పట్టణంలో రష్యా బలగాల షెల్లింగ్లో 11-14 ఏండ్ల ఇద్దరు బాలురు మరణించారు. మరోవైపు అజోవ్స్టల్ స్టీల్ప్లాంట్లోని ఉక్రెయిన్ సైనికులు లొంగని నేపథ్యంలో ‘విక్టరీ డే’కి ముందుగానే ప్లాంట్ను పూర్తిగా తమ అధీనంలోకి తెచ్చుకునే యత్నాలను రష్యా తీవ్రతరం చేసింది. ప్లాంట్ నుంచి ఉక్రెయిన్ పౌరుల తరలింపు ప్రక్రియ శనివారంతో పూర్తయింది. ఉక్రెయిన్కు మరో 1.6 బిలియన్ డాలర్ల సైనిక సాయం అందించనున్నట్టు బ్రిటన్ ట్రెజరీ విభాగం ఆదివారం వెల్లడించింది.
ఉక్రెయిన్లో బైడెన్ సతీమణి పర్యటన
అమెరికా మొదటి పౌరురాలు, అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ఉక్రెయిన్కు మద్దతుగా ఆదివారం ఆ దేశంలో ఆకస్మిక పర్యటన చేశారు. తాత్కాలిక షెల్టర్గా ఉన్న ఓ స్కూల్ను సందర్శించిన ఆమె.. అనంతరం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భార్య ఒలెనాతో సమావేశమయ్యారు. రష్యా యుద్ధం క్రూరమైనదని, ఉక్రెయిన్ ప్రజలకు అమెరికా పౌరులు మద్దతుగా ఉంటారని జిల్ బైడెన్ పేర్కొన్నారు.