న్యూఢిల్లీ: ఇక్కడ పరిస్థితులు బాగాలేవు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడికి రాకపోవడమే మంచిదని ఉక్రెయిన్లోని అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరులకు సూచించింది. ఏ క్షణాన్నైనా ఉక్రెయిన్పై రష్యా మిలటరీ చర్యకు పాల్పడటంతోపాటు కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి రాకుండా ఉండటమే మంచిదని ట్రావెల్ అడ్వైజరీలో పేర్కొన్నది. క్రిమియా, డొనెస్క్, లుహాన్స్క్లో పరిస్థితులు మరింతగా క్షీణించాయని హెచ్చరించింది.
నల్లసముద్రం తీరాన ఉన్న ఉక్రెయిన్లో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. దేశ సరిహద్దుల వెంబడి రష్యా లక్షలాది సంఖ్యలో సైనికులను మోహరించడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. రష్యా సైనికులు ఊహించని రీతిలో ఉత్పాతాన్ని సృష్టించవచ్చని నాటో కూటమి అంచనా వేస్తున్నది.
కాగా, ఉక్రెయిన్, రష్యా, కీవ్లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయ సిబ్బందికి సంబంధించిన కుటుంబాలను వీలైనంత త్వరగా తరలించాలని యూఎస్ స్టేట్ డిపార్ట్మెంట్ సూచించింది. ఉక్రెయిన్పై రష్యా మిలటరీ చర్య తీసుకునే ముప్పు పొంచిఉన్న నేపథ్యంలో ఈమేరకు ప్రకటించింది. రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియా, ఈస్టర్ ఉక్రెయిన్లో భద్రతాపరమైన సమస్యలు ఉన్నాయని తెలిపింది.