రష్యా-ఉక్రెయిన్ ఉద్రిక్తతలపై ఐరాస ఆందోళన
కీవ్, ఫిబ్రవరి 18: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం వస్తే అది మహా వినాశనానికి దారి తీస్తుందని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ఆందోళన వ్యక్తం చేశారు. 1990 ప్రచ్ఛన్న యుద్ధంతో పోలిస్తే ప్రస్తుతం ప్రపంచం అత్యంత ప్రమాదకర స్థితిలో ఉన్నదన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో తూర్పు ఉక్రెయిన్లోని పౌరులను రష్యాకు తరలిస్తున్నట్టు వేర్పాటువాద నాయకుడు డానిష్ పుషిలిన్ శుక్రవారం తెలిపారు. పిల్లలు, మహిళలు, వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు పేర్కొన్నారు. వీరి కోసం రష్యా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. శుక్రవారం తుర్పు ఉక్రెయిన్లో కారు బాంబు పేలినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరుగలేదన్నారు. మరోవైపు, ఉక్రెయిన్ సరిహద్దుల్లో ఇప్పటివరకూ 1.69-1.90 లక్షల బలగాలను రష్యా మోహరించినట్టు అమెరికా అంచనా వేసింది.