న్యూఢిల్లీ : నాలుగు ఉక్రెయిన్ భూభాగాలను రష్యా స్వాధీనం చేసుకోవడాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఖండించింది. ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానానికి 143 మంది అనుకూలంగా, వ్యతిరేకంగా ఐదుగురు సభ్యులు ఓటువేశారు. భారత్ సహా 35 దేశాలు తీర్మానంపై ఓటింగ్కు దూరంగా ఉన్నాయి.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానానికి దూరంగా ఉన్న తర్వాత భారత్.. ఉక్రెయిన్లో పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, పౌరుల మరణాలతో సహా ఘర్షణలు తీవ్రం కావడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. తీర్మానం సందర్భం ఐక్యరాజ్య సమితిలో భారత రాయబారి రుచిరా కాంబోజ్ మాట్లాడుతూ.. మానవ వ్యయంతో ఎలాంటి పరిష్కారాన్ని చేరుకోలేమని, శత్రుత్వాలు పెరగడం ఎవరికీ ప్రయోజనం కాదని భారతదేశం స్థిరంగా వాదిస్తున్నదని పేర్కొన్నారు.
దౌత్య పద్ధతిలో సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నాలు చేయాలని రుచిరా పిలుపునిచ్చారు. యూఎన్లో రష్యా రాయబారి వాసిలీ నెబెంజియా తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆయా దేశాలకు విజ్ఞప్తి చేశారు. విలీన ప్రాంతాల ప్రజలకు ఉక్రెయిన్కు తిరిగి వెళ్లాలని కోరుకోవడం లేదని పేర్కొన్నారు. అయితే, రష్యాపై తీర్మానం ఆమోదం పొందడంపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ స్పందించారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రత, ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాలను రక్షించడం అనే ఈ రెండు చారిత్రాత్మక తీర్మానానికి మద్దతు ఇచ్చిన 143 దేశాలకు కృతజ్ఞతలు అంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు ట్వీట్ చేశారు.