రష్యా దళాలతో ఉక్రెయిన్ సైన్యం దాదాపు నెల రోజులుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈయూ దేశాలతో తాజాగా స్వీడన్ నేతలతో మాట్లాడిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. తాము కేవలం ఉక్రెయిన్ ప్రజల కోసమే పోరాడటం లేదని, మొత్తం యూరప్ భద్రత కోసం ఫైట్ చే్తున్నామని చెప్పారు.
‘‘మేం మా ప్రజల కోసమే కాదు, మొత్తం యూరప్ భద్రత కోసం పోరాడుతున్నాం. ఈయూలో పూర్తి సభ్యత్వానికి మేం అర్హులమని చేతల ద్వారా నిరూపించాం’’ అని జెలెన్స్కీ అన్నారు. ఈ నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇదేనని, ఈ విషయంలో తమకు స్వీడన్ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నామని తెలిపారు. అలాగే యుద్ధం ముగిసిన తర్వాత ఉక్రెయిన్ పునర్నిర్మాణంలో స్వీడన్ సహకారం కోరారు.
రష్యా-ఉక్రెయిన్ దళాల మధ్య పోరు మొదలైనప్పటి నుంచి లక్షలాది మంది ఉక్రేనియన్లు స్వదేశం వదిలి పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రష్యాపై పశ్చిమ దేశాలు కఠినమైన ఆంక్షలు విధించాయి. తాజాగా రష్యాపై మరికొన్ని కఠినమైన ఆంక్షలు విధించడమేకాక, ఆ దేశానికి సంబంధించిన కుబేరుల ఆస్తులు జప్తు చేస్తున్నట్లు బ్రిటన్ ప్రకటించింది.