కీవ్ : ఫిబ్రవరి 24 నుంచి ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన దాడుల్లో ఇప్పటివరకూ 79 మంది చిన్నారులు మరణించారని దాదాపు వంద మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు వెల్లడించారు. రష్యా అణిచివేత శనివారం నాటికి 17వ రోజుకు చేరగా ఇప్పటికే పలు ఉక్రెయిన్ నగరాలు రష్యా వశమయ్యాయి.
ఇక రష్యా, ఉక్రెయిన్ మధ్య చర్చలతో విధ్వంసానికి తెరపడుతుందని ఐక్యరాజ్యసమితిలో భారత్ ఆశాభావం వ్యక్తం చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ప్రస్తుతం నేరుగా సాగుతున్న సంప్రదింపులతో విద్వేషాలు సమసిపోతాయని ఆశిస్తున్నామని ఐక్యరాజ్యసమితిలో భారత్ శాశ్వత ప్రతినిధి టీఎస్ తిరుమూర్తి అన్నారు. దౌత్య సంప్రదింపులు మినహా ఉద్రిక్తతల నివారణకు ప్రత్యామ్నాయ మార్గం లేదని స్పష్టం చేశారు.
సాదారణ పరిస్ధితులు నెలకొనేలా చూడటం తక్షణావశ్యకతని పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్, రష్యా విదేశాంగ మంత్రుల సమావేశంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది. కాగా ఉక్రెయిన్లో తమ దేశం నేరుగా పోరాడబోదని నాటో, రష్యాల మధ్య వివాదం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు.