ఉక్రెయిన్లో చాలా చిన్న చిన్న నగరాలు ధ్వంసమైపోయాయని, అవి ఇక లేవని ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ఆ దేశంపై రష్యా దళాలు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక యూరప్ దేశంపై జరిగిన అతిపెద్ద దాడిగా దీన్ని జెలెన్స్కీ అభివర్ణించారు.
ప్రస్తుతం ఉక్రెయిన్ రాజధాని కీవ్కు పదిమేను కిలోమీటర్ల దూరంలో రష్యా బలగాలు ఉన్నాయని సమాచారం. ఈ నగరాన్ని రష్యా దళాలు చుట్టుముట్టడంపై జెలెన్స్కీ మాట్లాడుతూ.. ‘‘వాళ్లు కార్పెట్ బాంబింగ్తో ఈ ప్రాంత చరిత్రను తుడిచిపెట్టేయాలని, మమ్మల్ని నాశనం చేసి, తర్వాత కీవ్లో అడుగు పెట్టాలని అనుకుంటే.. వాళ్లని రానివ్వండి. కానీ ఇక్కడ వాళ్లే బతకాల్సి ఉంటుంది’’ అని చెప్పాడు.
కీవ్ సమీపంలో రష్యా దాడుల నుంచి పారిపోతున్న సాధారణ ప్రజలపై కూడా రష్యా బలగాలు దాడులు చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు ఆరోపించారు. ఈ దాడిలో ఒక చిన్నారి సహా ఏడుగురు దుర్మరణం పాలైనట్లు వెల్లడించారు. అయితే ఇప్పటి వరకు తాము ఎన్నడూ ప్రజలను టార్గెట్ చేయలేదని రష్యా గట్టిగా చెప్తోంది. తమ బలగాలు చుట్టుముట్టిన నగరాల నుంచి ప్రజలను బయటకు తీసుకెళ్లలేకపోవడంలో ఉక్రెయిన్ తప్పే ఉందని అంటోంది. అయితే ఈ వాదనను ఉక్రెయిన్, దాని యూరప్ మిత్రదేశాలు ఖండిస్తున్నాయి.