పిల్లల కోసం తల్లిదండ్రులు ఎంత కష్టమైనా చేస్తారు. ఇదిగో ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న తండ్రి కూడా అలాంటి వాడే. అమెరికాలో హాయిగా ఉంటున్న అతను.. తన కుమార్తె కోసం యుద్ధక్షేత్రంగా మారిన ఉక్రెయిన్ చేరుకున్నాడు. ఉక్రెయన్ ప్రజలందరూ బోర్డర్ దాటి పక్క దేశాలకు పారిపోతుంటే.. అతనుమ మాత్రం బోర్డర్ దాటి ఉక్రెయిన్లో అడుగు పెట్టాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని మసాచుసెట్స్లో విలియం హుబ్బార్డ్ అనే వ్యక్తి నివశిస్తున్నాడు. అతని కుమార్తె ఎయిసిలిన్ ఉక్రెయిన్లో ఉంటోంది. బ్యాలెట్ నేర్చుకోవడంక కోసం ఆమె ఉక్రెయిన్ వచ్చింది. ఆమె అక్కడ ఉండగానే రష్యాతో యుద్ధం మొదలైంది. యుద్ధం భారీ స్థాయికి చేరడానికి ముందే ఉక్రెయిన్ వదిలి వెళ్లిపోవడానికి ఎయిసిలిన్ ప్రయత్నించింది.
కానీ ఎనిమిది నెలల ఆమె కుమారుడు సెరాఫిమ్కు బర్త్ సర్టిఫికెట్, పాస్పోర్టు లేవు. ఈ కారణంగా బోర్డర్ దాటడం కుదరలేదు. గతేడాది లాక్డౌన్ సమయంలో ఎయిసిలిన్కు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లడం కుదరకపోవడంతో ఇంట్లోనే ప్రసవం చేశారు. ఈ కారణంగా సెరాఫిమ్ పేరిట ఎటువంటి ధ్రువ పత్రాలు లేవు. దాంతో తల్లీబిడ్డలిద్దరూ ఉక్రెయిన్లో ఉండిపోవాల్సి వచ్చింది.
ఈ విషయం తెలుసుకున్న విలియం.. హుటాహుటిన పోలాండ్ చేరుకున్నాడు. అక్కడ బోర్డర్ దాటి ఉక్రెయిన్ వెళ్లి తన కుమార్తె, మనుమడిని కలుసుకున్నాడు. కీవ్కు సమీపంలోని ఇంట్లోనే ఇద్దరినీ కలుసుకున్న విలియం.. స్లొవేకియా బోర్డర్కు వాళ్లను తీసుకొచ్చాడు. ఇలా రణక్షేత్రంలా మారిన ప్రాంతానికి రావడానికి భయం వేయలేదా? అని విలియంను ప్రశ్నిస్తే.. ‘‘తండ్రులు చేసేది అదే. వాళ్ల కుటుంబాన్ని కాపాడుకోవడం’’ అంటూ సమాధానం చెప్పాడతను.