కీవ్: ఉక్రెయిన్పై దాడికి వెళ్లిన రష్యాకు తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఉక్రెయిన్ చేసిన ఎదురుదాడిలో 5300 మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. రష్యా దాడికి నేటితో అయిదు రోజులయ్యాయి. ఇవాళ కీవ్లోని రక్షణ కార్యాలయం తన ఫేస్బుక్లో ఓ స్టేట్మెంట్ను పోస్టు చేసింది. తమ సైన్యం జరిపిన కాల్పుల్లో 5300 మంది రష్యా సైనికులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ అధికారులు చెప్పారు. ఆ దాడిలో రష్యాకు చెందిన 191 ట్యాంక్లు, 29 ఫైటర్ విమానాలు, 29 హెలికాప్టర్లు, 816 యుద్ద వాహనాలు ధ్వంసం అయినట్లు ఉక్రెయిన్ తెలిపింది. అయితే ఈ విషయాన్ని రష్యా పూర్తిగా ద్రువీకరించలేదు. కానీ బ్రిటన్ రక్షణశాఖ మంత్రి మాత్రం తాజా దాడిలో రష్యాకు తీవ్ర నష్టం ఎదురైనట్లు వ్యాఖ్యానించారు. తొలి నాలుగు రోజుల్లోనే రష్యా తన సైన్యాన్ని భారీగా కోల్పోయినట్లు ఆయన వెల్లడించారు. ఆదివారం రష్యా సైన్యం కూడా ఓ కీలక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. తమ సైన్యం చాలా నష్టపోయినట్లు ఆ ప్రకటనలో రష్యా చెప్పింది. కానీ దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదు.