వాషింగ్టన్: రష్యాతో దాదాపు నాలుగేండ్లుగా సాగుతున్న యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించినట్టు అమెరికా అధికారి ఒకరు వెల్లడించారు. ట్రంప్ ప్రతిపాదనపై రష్యా ప్రతినిధులతో అమెరికా ఆర్మీ సెక్రటరీ డాన్ డ్రిస్కోల్ అబుధాబిలో చర్చలు జరపనున్నారు. ఉక్రెయిన్ ప్రతినిధుల బృందం కూడా అబుధాబిలో ఉన్నది. ఈ క్రమంలో అమెరికా అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘శాంతి ఒప్పందానికి ఉక్రెయిన్ అంగీకరించింది.
కేవలం కొన్ని స్వల్ప అంశాలు కొలిక్కి రావాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ సెక్రటరీ రుస్తుం ఉమ్రెవ్ మాట్లాడుతూ.. జెనీవాలో చర్చించిన ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు చెప్పారు. తదుపరి చర్యలపై తమ ఐరోపా భాగస్వామ్య దేశాలు అండగా ఉంటాయని భావిస్తున్నామన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ స్పందిస్తూ.. జెనీవా సమావేశాల అనంతరం శాంతి ఒప్పందం దిశగా కీలక అడుగులు పడ్డాయని అన్నారు.